ఏపీ నుంచి రాజ్యసభకు వ్యాపారులు: 'టీ నుంచి ప్రజల కోసం పనిచేసేవాళ్లు'
హైదరాబాద్: రాజ్యసభ సీట్ల కేటాయింపు విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై టీఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పెద్దల సభగా భావించే రాజ్యసభకు మేము ప్రజల కోసం పని చేసే వాళ్లను పంపిస్తుంటే, చంద్రబాబు మాత్రం వ్యాపారులను బరిలో నిలబెట్టారని ఆరోపించారు.
టీఆర్ఎస్కు, టీడీపీకి ఉన్న తేడా అదేనని ఆయన అన్నారు. రాజ్యసభ ఎన్నికల అభ్యర్ధుల నామినేషన్కు మంగళవారం చివరి రోజు కాడవంతో తెలుగు రాష్ట్రాల్లోని వివిధ పార్టీల నుంచి ఎంపికైన అభ్యర్ధులు మంగళవారం నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం ఆరు రాజ్యసభ సీట్లు ఖాళీ అయ్యాయి.
తెలంగాణలో రెండు, ఏపీలో నాలుగు సీట్లు ఖాళీ అవ్వగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్యాబలాన్ని బట్టి వీటిలో మూడు సీట్లు తెలుగుదేశం పార్టీకి, మరో సీటు వైసీపీకి దక్కనుంది. అయితే వైసీపీకి దక్కనున్న ఒక్క సీటుకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి అభ్యర్ధిత్వాన్ని వైయస్ జగన్ ఖరారు చేయడంతో నామినేషన్ కూడా దాఖలు చేశారు.
ఇక ఏపీ నుంచి టీడీపీ తరఫున సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, మిత్రధర్మంలో భాగంగా టీడీపీ మద్దతుతో బీజేపీ తరఫున కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభు నామినేషన్ దాఖలు చేశారు. తెలంగాణలో రెండు సీట్లు టీఆర్ఎస్కే దక్కనున్నాయి. ఈ నేపథ్యంలో ఆ పార్టీ తరుపున డి. శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంతరావును సీఎం కేసీఆర్ ఎంపిక చేశారు.
వీరిద్దరూ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్ పై విధంగా స్పందించారు.