లోకసభలో మోడీ సీటు ముందు టిఆర్ఎస్ ఎంపీల ఆందోళన
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి పార్లమెంటు సభ్యులు శుక్రవారం పార్లమెంటులో ఆందోళన వ్యక్తం చేశారు. హైకోర్టు కావాలంటూ పార్లమెంటు నినాదాలు చేశారు.
అనంతరం, లోకసభలో ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ సీటు ముందుకు వెళ్లి నిలబడి మౌనంగా తమ నిరసన తెలిపారు. గత పార్లమెంటు సమావేశాల్లో కూడా టీఆర్ఎస్ ప్రత్యేక హైకోర్టు కోసం ఆందోళన చేసింది. ప్రత్యేక హైకోర్టు లేకపోతే తెలంగాణకు న్యాయం జరగదని టీఆర్ఎస్ ఎంపీలు చెబుతున్నారు.
గ్రామజ్యోతిపై పొన్నం ప్రశ్న
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గ్రామజ్యోతి పైన కరీంనగర్ మాజీ పార్లమెంటు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ శుక్రవారం ప్రశ్నల వర్షం కురిపించారు. మన ఊరు - ప్రణాళికకు, గ్రామజ్యోతికి తేడా ఏమిటో చెప్పాలని ముఖ్యమంత్రి కెసిఆర్ను ప్రశ్నించారు.
తెలంగాణలో రైతులు కరువుతో అల్లాడుతుంటే ఇప్పటి వరకు ఒక్కసారి అయినా సమీక్ష చేశారా అని నిలదీశారు. కెసిఆర్ పరిపాలన అవినీతిమయమన్నారు. ఇది అరాచక పాలన అని ధ్వజమెత్తారు.