సంతోషం లేదు.. ఓకే: తెరాస, ఏపీ బిల్లుని వ్యతిరేకిస్తాం
హైదరాబాద్: కేంద్ర బడ్జెట్ పట్ల పూర్తి సంతోషంగా లేకున్నప్పటికీ బాగానే ఉందని తెరాస పార్లమెంటరీ పార్టీ నాయకుడు కె కేశవ రావు శనివారం అన్నారు. ఏపీ, తెలంగాణలకు విభజన సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేస్తామని బడ్జెట్లో పేర్కొనటాన్ని స్వాగతిస్తున్నామన్నారు.
దేశంలో ఫార్మా రంగంలో అగ్రస్థానానికి వెళ్లాలని తెలంగాణ భావిస్తోందని, ఈ మేరకు తమ నుంచి జైట్లీ వివరాలు కూడా తీసుకున్నారని, కానీ తాము కోరిన విధంగా ఫార్మా యూనివర్శిటీని మాత్రం ప్రకటించలేదన్నారు. రాష్ట్రాల పట్ల ప్రధాని మోడీ ప్రభుత్వ సమాఖ్య విధాన ఆలోచనలు చాలా బాగున్నాయని, రాష్ట్రాలు కోరుకునేది కూడా ఇదేనన్నారు.
ఆ మేరకు బడ్జెట్లో కేటాయింపులు చేయటం శుభపరిణామమన్నారు. దేశ ఆర్థికాభివృద్ధిలో రాష్ట్రాలు సమాన భాగస్వాములని జైట్లీ ప్రకటించారని, ఈ క్రమంలో గతంలో తెలంగాణకు రూ.3.8 లక్షల కోట్లు వస్తే ఇప్పుడు రూ.5.24 లక్షల కోట్లకు కేటాయింపులు పెరిగాయని జితేందర్ రెడ్డి చెప్పారు. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ప్రాణహిత-చేవెళ్లకు జాతీయ హోదా కావాలని ముఖ్యమంత్రి కోరినా ఇవ్వకపోవటం బాధాకరమన్నారు.
ఈఎస్ఐ ఎంపిక ఆప్షన్ ఇవ్వటం కార్మిక వ్యతిరేకంగా ఉందన్నారు. కులీకుతుబ్షా టూంబ్స్ను చారిత్రక కట్టడాలుగా ప్రకటించటాన్ని స్వాగతించారు. ఓబీసీలను కేంద్ర బడ్జెట్లో పూర్తిగా మర్చిపోవటాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని బూర నర్సయ్య గౌడ్ అన్నారు.
అత్యధిక మెజార్టీ సాధించిన ప్రజాకర్షక ప్రభుత్వం పూర్తిస్థాయిలో ప్రవేశపెట్టిన బడ్జెట్పై దేశ ప్రజలు చాలా ఆశలు పెట్టుకున్నారని, కానీ తనతో పాటు దేశ ప్రజలంతా నిరాశ చెందారని ఎంపీ కవిత అన్నారు. మేకిన్ ఇండియా అంటూ ఫ్యాన్సీ పేర్లతో పదాల పటాటోపం ప్రదర్శిస్తున్నారని, ప్రజలకు మేలు కలిగించేలా ఏమున్నాయనేది అంతా ఆలోచించాల్సిన అంశమన్నారు.
రైతులకు సంబంధించి బడ్జెట్లో ఒక్క మాటా లేదని, నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ గురించి ప్రధాని మోడీ ప్రభుత్వంలోకి వచ్చినప్పటి నుంచి చెబుతూనే ఉన్నారని, ప్రభుత్వం వచ్చి సంవత్సరమవుతున్నా విధివిధానాలు ఖరారు చేయలేదని, బడ్జెట్ కూడా కేటాయించలేదన్నారు.
ఏపీ శాసన మండలి సీట్ల పెంపుపై పునర్వ్యవస్థీకరణ చట్టానికి సవరణ బిల్లును సోమవారం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ, తెలంగాణ మధ్య జఠిల సమస్యల పరిష్కారానికి చట్టాన్ని సవరించాల్సి ఉంటే సవరించాలని, అంతే తప్ప కేవలం మండలి సీట్ల కోసం బిల్లు తీసుకురావటాన్ని తాము వ్యతిరేకించాలనుకుంటున్నామని కేకే, వినోద్ కుమార్ చెప్పారు.