బాబుతో గవర్నర్ మాట్లాడతానన్నారు: టిఆర్ఎస్, మోడీపై అసహనం
హైదరాబాద్: ఏడాది గడిచినా తెలంగాణకు ఏర్పాటు చేసే హైకోర్టు పైన నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని తెలంగాణ రాష్ట్ర సమితి పార్లమెంటు సభ్యులు గురువారం అన్నారు. ఎంపీలు వినోద్ కుమార్, జితేందర్ రెడ్డి, కె కేశవ రావు, బూర నర్సయ్య గౌడ్, సీతారాం నాయక్, కవిత గవర్నర్ నరసింహన్ను కలిశారు.
రాజ్భవన్లో గవర్నర్ నరసింహన్ను కలిశారు. ఈ సందర్భంగా హైకోర్టును త్వరగా విభజించేలా చూడాలని గవర్నర్కు ఎంపీలు విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు విషయమై గవర్నర్ను కలిసి విజ్ఞప్తి చేశామన్నారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుతో మాట్లాడుతానని గవర్నర్ హామీ ఇచ్చారని చెప్పారు.
ప్రత్యేక హైకోర్టు పైన పార్లమెంటులో నిలదీస్తామని చెప్పారు. ఏపీ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతోందన్నారు. ఏడాది గడిచినా హైకోర్టు లేకపోవడం బాధాకరమన్నారు. మోడీ సర్కార్ దీని పైన నిర్లక్ష్యం చేస్తోందన్నారు. హైకోర్టుపై ఇంకా ఆలస్యం కావడం బాధాకరమని కెకె అన్నారు.
తోక ముడిచారు: జూపల్లి
పాలమూరు ప్రాజెక్టులపై చర్చించే దమ్ము లేకనే తెలంగాణ టీడీపీ నేతలు తోక ముడిచారని మంత్రి జూపల్లి కృష్ణారావు ధ్వజమెత్తారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో తెలంగాణ టీడీపీ నేతల కోసం జూపల్లి గంట పాటు వేచి చూశారు.
అనంతరం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ టీడీపీ నేతలకు దమ్ము లేదన్నారు. వారు పాలమూరు ప్రాజెక్టుల విషయం చేసిందేమి లేదని, చంద్రబాబు తన తొమ్మిదేళ్ల పాలనలో పాలమూరుకు కనీసం రూ.10 కోట్లు ఖర్చు పెట్టలేదన్నారు.
తెలంగాణ టీడీపీ నేతలు దిగజారి బతుకుతున్నారన్నారు. వాస్తవాలు బయటపడుతాయనే వారు తప్పించుకు తిరుగుతున్నారని, దమ్ము, ధైర్యం ఉంటే పాలమూరు ఎత్తిపోతలకు టీడీపీ అడ్డు కాదని చంద్రబాబుతో లేఖ రాయించాలన్నారు.
టీడీపీ నేతలు తప్పుడు మాటలు మాట్లాడుకుంటూ తప్పును కప్పి పుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని, రంగారెడ్డి, పాలమూరు జిల్లా ప్రజలకు ఓపిక నశించిందని, త్వరలోనే తెలంగాణ టీడీపీ నేతలకు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు.