ఎమ్మెల్యేలకు టీఆర్ఎస్ వల, దొంతిని వారించారు
హైదరాబాద్: వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం నుండి స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ గెలిచి, అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరిన దొంతిరెడ్డి మాధవ రెడ్డిని తమ పార్టీలో చేరాలని తెలంగాణ రాష్ట్ర సమితి ఆహ్వానించినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే, ఆయనను కాంగ్రెస్ నేతలు వారించారని సమాచారం.
తద్వారా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులందర్నీ గెలిపించుకోవాలన్న పట్టుదలతో ఉన్న తెరాస ఇతర పార్టీల ఎమ్మెల్యేలపై వల విసురుతున్నట్లుగా కనిపిస్తోంది. ఆరు స్థానాలకు ఈ ఎన్నికలు జరుగుతుండగా ఏడుగురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు.
ఐదుగురు తెరాస అభ్యర్థులు, కాంగ్రెస్, టీడీపీ-బీజేపీల నుంచి ఒక్కో అభ్యర్థి ఉన్నారు. మజ్లిస్ పార్టీ మద్దతుతో నాలుగు స్థానాలను సులువుగా గెలుస్తామని భావిస్తున్న తెరాస.. తమతోపాటు ఎవరికీ పూర్తి స్థాయి మెజార్టీ లేదనే ఉద్దేశంతో పార్టీ తరఫున ఐదో అభ్యర్థినీ రంగంలోకి దించింది.
అయితే, ఈ ఎన్నికల్లో తమ అంచనాలన్నీ తలకిందులై పార్టీ అభ్యర్థి ఒకరు ఓడిపోతే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని, అధికారంలో ఉన్న మేరకు రాజకీయంగానూ నష్టపోవాల్సి వస్తుందని తెరాస వర్గాలు ఆందోళన చెందుతున్నాయని చెబుతున్నారు.
ఈ క్రమంలో సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కాపాడుకుంటూ.. ముందు జాగ్రత్తగా కొంతమంది ఇతర ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టటంపై దృష్టి సారించారని సమాచారం. సమాచారం మేరకు.. రాష్ట్రంలోని ఏకైక స్వతంత్ర ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డితో తెరాస ముఖ్యులు ఇప్పటికే సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది.
మరోవైపు, మద్దతు కోసం గ్రేటర్ హైదరాబాద్లోని ఒక టీడీపీ ఎమ్మెల్యే, నల్గొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఒకరిపైనా తెరాస గురిపెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. వారితో సీనియర్ మంత్రి ఒకరు ఇప్పటికే మాట్లాడారని అంటున్నారు. మరోవైపు, తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు టీడీపీ కూడా వ్యూహం పన్నుతుంది. తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని దొంతి మాధవ రెడ్డి స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది.