గ్రేటర్లో కారు స్పీడ్.. ఇదీ ఓట్ల లెక్క: మజ్లిస్కు సగం తగ్గినా, టాంపరింగ్ ఆరోపణలు
హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అపూర్వ విజయం సాధించింది. టిఆర్ఎస్ ధాటికి ప్రతిపక్షాలు తీవ్రమైన భంగపాటుకు గురయ్యాయి. టిఆర్ఎస్ ఏకంగా 99 కార్పొరేటర్లను గెలిచింది. మజ్లిస్ 44, టిడిపి 1, బిజెపి 4, కాంగ్రెస్ 2 సీట్లు గెలుచుకుంది.
గత సార్వత్రిక ఎన్నికల్లో జిహెచ్ఎంసి పరిధిలోని వివిధ నియోజకవర్గాల్లో టిఆర్ఎస్ సాధించిన ఓట్లు, తాజాగా జిహెచ్ఎంసి ఎన్నికలకు అదే నియోజకవర్గాల్లో సాధించిన ఓట్లను చూస్తే ఇది తిరుగులేని విజయంగా చెప్పుకోవచ్చు. అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్కు 18.6 శాతం మంది ఓటేస్తే ఇప్పుడు 44.42కు పెరిగింది.
సార్వత్రిక ఎన్నికల నాటికి, ఇప్పటికి ఓడలు బళ్లు, బళ్లు ఓడలయ్యాయి. అనేక ఏళ్లుగా హైదరాబాద్ మహానగరంలో ఆధిపత్యాన్ని ప్రదర్శించిన టిడిపి, బిజెపి. కాంగ్రెస్ పార్టీలు తాజాగా జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో కుదేలయ్యాయి.
2014 అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి, బిజెపి కూటమి పూర్తి ఆధిక్యతను ప్రదర్శించింది. గ్రేటర్ ఎన్నికలకు వచ్చేటప్పటికి భారీగా ఓట్లను కోల్పోయింది. కాంగ్రెస్ పరిస్థితీ అంతే. మజ్లిస్కు ఓట్లు తగ్గినా కూడా 2009 ఎన్నికలతో పోల్చుకుంటే ఒక డివిజన్ అధికంగానే గెలుచుకుంది.
ఇదే సమయంలో అధికార టిఆర్ఎస్ మాత్రం నగరంలో పూర్తి ఆధిక్యతను ప్రదర్శించింది. భాగ్యనగరంలో తొలిసారి సత్తా చాటింది. ఒక్కసారిగా 25.49 శాతం ఓట్లను గత అసెంబ్లీ ఎన్నికల కంటే అదనంగా సాధించడం ద్వారా సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది.
2014 శాసనసభ ఎన్నిల్లో గ్రేటర్ పరిధిలో 24 స్థానాలుంటే టిడిపి 9, బిజెపి 5 స్థానాలను మొత్తం ఈ కూటమి 14 స్థానాలను దక్కించుకుంది. నాడు ఈ రెండు పార్టీలు పూర్తి ఆధిక్యతను ప్రదర్శించాయి. 21 నెలలు తిరగకుండా ఈ రెండు పార్టీల ఓట్ల ఆధిక్యతకు భారీ గండిపడింది.
2014లో ఈ కూటమికి 14.66 (34.42శాతం)లక్షల ఓట్లు వస్తే, ఈ ఎన్నికల్లో 7.85 (23.46శాతం) లక్షల ఓట్లు మాత్రమే దక్కాయి. అంటే టిడిపి - బిజెపి కూటమి 6,80,778 (10.96 శాతం) ఓట్లను కోల్పోయింది.
కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో 6.19 (14.55శాతం) లక్షల ఓట్లను సాధించింది. ఇప్పుడు 3.48 (10.4శాతం) లక్షల ఓట్లను మాత్రమే సాధించింది. ఓట్ల వేటలో చాలా వెనుకబడింది. గత ఎన్నికలతో పోలిస్తే 2,71,513 (4.15 శాతం)లక్షల ఓట్లను ఈ పార్టీ కోల్పోయింది.
మజ్లిస్ 2009 అసెంబ్లీ ఎన్నికల్లో 11.42 (26.64శాతం) లక్షల ఓట్లను సాధించింది. ఈ ఎన్నికల్లో 5.30 (15.85 శాతం) లక్షల ఓట్లను మాత్రమే సాధించింది. అంటే ఈ ఎన్నికల్లో మజ్లిస్కు 6,11,842 (10.79 శాతం) ఓట్లు తగ్గాయి. అయినా కూడా ఈ పార్టీ బల్దియా ఎన్నికల్లో 44 డివిజన్లను సొంతం చేసుకుంది. 2009 బల్దియా ఎన్నికల్లో 43 స్థానాలను సాధించింది.
అన్ని పార్టీల కంటే టిఆర్ఎస్ అధికంగా ఓట్లను సాధించంది. తద్వారా భాగ్యనగరంపై మొదటిసారి భారీ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో 7.82 (18.36శాతం) లక్షల ఓట్లను సాధించింది.
ఈ బల్దియా ఎన్నికల్లో 14.68 (43.85శాతం) లక్షల ఓట్లను సాధించి ఓట్లను సాధించడంలో మరో పార్టీకి అందనంత ఎత్తుకు ఎదిగింది. ఈ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికలకంటే ఈ బల్దియా ఎన్నికల్లో అదనంగా 6,86,364(25.49 శాతం) ఓట్లను సాధించి ఆధిక్యాన్ని సొంతం చేసుకుంది.
మరోవైపు, గ్రేటర్ ఎన్నికల్లో టాంపరింగ్ జరిగిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి మాట్లాడుతూ... ఎన్నికల్లో టాంపరింగ్ జరిగిందని, దీనిపై తాము న్యాయపోరాటం చేస్తామని చెబుతున్నారు. అందుకు ఆమె కొన్ని ఉదాహణలు చెప్పారు.
అందరూ తమకే ఓట్లు వేశామని చెబుతున్నారని, తమ ఓట్లు ఏమయ్యాయని అడిక్ మెట్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఇందిర ప్రశ్నించారు. అపార్టుమెంట్ల వాసుల మద్దతుతోనే గ్రేటర్ బరిలో నిలిచానని, ఊహించని రీతిలో తనకు తక్కువ ఓట్లు వచ్చాయని, మిగతా వారి ఓట్లు ఏమయ్యాయని ఆమె ప్రశ్నించారు.