టీఆర్ఎస్ సభ: టీడీపీ, కాంగ్రెస్ నేతల గృహ నిర్బంధం
టీఆర్ఎస్ ప్రగతి నివేదన సభను పురస్కరించుకొని పోలీసులు జిల్లాకు చెందిన పలువురు తెలుగుదేశం పార్టీ నేతలను ముందస్తుగా బుధవారం గృహ నిర్బంధం చేశారు.
వరంగల్: టీఆర్ఎస్ ప్రగతి నివేదన సభను పురస్కరించుకొని పోలీసులు జిల్లాకు చెందిన పలువురు తెలుగుదేశం పార్టీ నేతలను ముందస్తుగా బుధవారం గృహ నిర్బంధం చేశారు. హన్మకొండ బాలసముద్రంలో నివాసముండే టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు ఈగ మల్లేశంతోపాటు గ్రేటర్ వరంగల్ అధ్యక్షుడు కక్కె సారయ్య తదితర నేతలను గురువారం నాటి టీఆర్ఎస్ సభ పూర్తయ్యే వరకు బయటకు వెళ్లనీయకుండా పోలీసు పహారా పెట్టినట్లు నేతలు తెలిపారు.
ఇంతేజార్గంజ్ సీఐ రవికుమార్తోపాటు ఇతర సిబ్బంది తమను ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మూడేళ్ల పాలనలో ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చకపోవడాన్ని నిరసిస్తూ బుధవారం టీఆర్ఎస్ నేతలు 18 అంశాలతో కూడిన బహిరంగ లేఖను విడుదల చేసి ఫ్యాక్స్ ద్వారా ముఖ్యమంత్రికి పంపించిన నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం కావాలని ఇలాంటి చర్యలకు పాల్పడుతుందన్నారు.
కార్యక్రమంలో నేతలు శ్రీరాముల సురేష్, సంపత్ యాదవ్, తూళ్ల కుమారస్వామి, మాదాసి బాబు, జిలకర వీరస్వామి, శ్యాం గౌడ్, వెంకటేశ్వరరావు, అర్శనపల్లి విద్యాసాగర్రావు, రామన్న, తదితరులు ఉన్నారు. కాగా, కాంగ్రెస్ నాయకులను కూడా గురువారం గృహ నిర్బంధం చేశారు. వీరిలో డిసీసీ అధ్యకక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రాజనాల శ్రీహరి ఉన్నారు.
రేపు పాలకుర్తిలో సీఎం పర్యటన
పాలకుర్తి: ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం జనగామ జిల్లా పాలకుర్తిలో పర్యటించనున్న దృష్ట్యా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన, ఎమ్కెల్యే ఎర్రబెల్లి దయాకర్రావు అధికారులను ఆదేశించారు. మండలంలోని రాఘవాపురంలో బుధవారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మండలంలోని పాలకుర్తి బమ్మెర రాఘవాపురం గ్రామాల్లో సీఎం కేసీఆర్ పర్యటిస్తారని చెప్పారు.
మొదట శ్రీ సోమేశ్వర లక్ష్మీనర్సింహాస్వామి దేవస్థానంలో పూజలు చేస్తారని, ఆ తర్వాత రాఘవాపురం గ్రామాన్ని సందర్శిస్తారని తెలిపారు. అదే గ్రామంలో నూతన గ్రామపంచాయతీని ప్రారంభించి, మిషన్భగీరథ, డబుల్బెడ్ రూం ఇళ్లకు శంకుస్థాపన చేస్తారని అన్నారు.
ఎమ్మెల్యే దయాకర్రావు మాట్లాడుతూ.. బమ్మెర గ్రామంలోనే జిల్లాస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులతో కార్యక్రమం ఉంటుందన్నారు. అదే విధంగా పథకాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తారని, అనంతరం బమ్మెరలో ప్రెస్ మీట్లో పాల్గొంటారని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ శ్రీదేవసేన, ఎమ్మెల్యే దయాకర్రావు, జనగామ డీసీపీ వెంకన్న, వర్ధన్నపేట ఏసీపీ దుర్గయ్య యాదవ్, సీఐ కరుణాసాగర్రెడ్డి పాలకుర్తిలో హెలీప్యాడ్ను పరిశీలించారు.