ఫోన్ ట్యాపింగ్: గవర్నర్తో టి ఇంటెలిజెన్స్ చీఫ్ భేటీ, కెసిఆర్ కూడా
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి గవర్నర్ నరసింహన్తో మంగళవారం నాడు భేటీ అయ్యారు. ఓటుకు నోటు కేసు అనంతరం ఆంధ్రప్రదేశ్ ప్రజాప్రతినిధులు, అధికారులకు చెందిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్తో ఇంటెలిజెన్స్ చీఫ్ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. ట్యాపింగ్ వ్యవహారంపై హైకోర్టు, సుప్రీం కోర్టుకు కూడా చేరాయి. దీనిపై కేంద్రం దృష్టి సారించింది. నివేదిక పంపించాలని కేంద్రం చెప్పింది. ఈ నేపథ్యంలో శివధర్ భేటీ అయ్యారు. గవర్నర్ నరసింహన్ ఈ నెల 7వ తేదీన ఢిల్లీకి వెళ్తున్నారు.
గవర్నర్తో కెసిఆర్ భేటీ
గవర్నర్ నరసింహన్తో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మంగళవారం సాయంత్రం భేటీ అయ్యారు.
అంతకుముందు సచివాలయంలో వ్యవసాయ శాఖపై సమీక్ష నిర్వహించిన కెసిఆర్ మాట్లాడుతూ... తెలంగాణలో రెండు పంటలు పండే కాలం ముందు ఉందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా మారుస్తామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా భూసార పరీక్షలు జరుపుతున్నట్లు చెప్పారు.
సెర్చ్ కమిటీని నియమించి విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లను నియామకాలు చేపట్టాలన్నారు. వ్యవసాయ శాఖలో ఖాళీలను భర్తీ చేయాలన్నారు. సాగు పద్ధతులపై రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు. వ్యవసాయానికి పూర్వ వైభవం తీసుకు వస్తామని చెప్పారు.