'మహా' ఒప్పందం: హరీష్ కీలక పాత్ర, ఫడ్నవీస్ను గుర్తుంచుకుంటాం... కేసీఆర్
ముంబై: తుమ్మిడిహట్టి, మేడిగడ్డ ఆనకట్టల ఎత్తు పైన మహారాష్ట్ర-తెలంగాణల మధ్య కీలక ఒప్పందం జరిగింది. ముంబైలోని సహ్యాద్రి అతిథి గృహంలో మంగళవారం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల (కేసీఆర్, ఫడ్నవీస్) సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. గత మార్చి 26న జరిగిన ఒప్పందానికి ఇది కొనసాగింపు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ను తెలంగాణ ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని చెప్పారు. ఇది చారిత్రక ఒప్పందమన్నారు. ఈ ఒప్పందం సువర్ణాక్షరాలతో లిఖించదగ్గదన్నారు.
స్నేహపూర్వక వాతావరణంలో రాష్ట్రాల నడుమ సంబంధాలు బలోపేతమవుతాయని చెప్పారు. భవిష్యత్తులోను మహారాష్ట్రతో స్నేహ సంబంధాలు కొనసాగిస్తామని చెప్పారు. ఇది ఇరు రాష్ట్రాల మధ్య చారిత్రకం అన్నారు. తెలంగాణకు అన్యాయం జరిగింది కాబట్టే అరవై ఏళ్లుగా పోరాడామన్నారు. కేంద్రం జోక్యం లేకుండానే ఒప్పందం సంతోషమన్నారు.
హరీష్ కీలక పాత్ర
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ మాట్లాడుతూ.. ఈ ఒప్పందం వల్ల ఇరు రాష్ట్రాల సంబంధాలు మరింత బలపడుతాయన్నారు. ఈ ఒప్పందంలో మంత్రి హరీష్ రావు కీలక పాత్ర పోషించారని చెప్పారు. కేసీఆర్ ఆచరణాత్మకంగా వ్యవహరించారని చెప్పారు. అనంతరం సీఎం కేసీఆర్ను ఫడ్నవీస్ శాలువాతో సత్కరించారు. కేసీఆర్ ఆయనకు చార్మినార్ మెమొంటోను బహూకరించారు.
39 లక్షల ఎకరాలకు సాగునీరు
తెలంగాణలో 39 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఇది కీలక ముందడుగు అని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. గోదావరి నదిపై మూడు బ్యారేజీల నిర్మాణానికి తెలంగాణ, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు కేసీఆర్, ఫడ్నవీస్ చారిత్రక ఒప్పందం కుదుర్చుకున్నారు.
మూడు ఒప్పందాలు
ఈ చారిత్రక ఒప్పందంతో నీటి పారుదల రంగంలో నూతన అధ్యాయానికి నాంది పలికారు. ముంబై సహ్యాద్రి అతిథి గృహంలో ఈ కార్యక్రమం జరిగింది. మేడిగడ్డ, తుమ్మిడిహట్టిలతో పాటు చనాక - కొరాటా బ్యారేజీలపై ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ మూడు ఒప్పందాలపై సంతకాలు చేశారు.
950 టీఎంసీల నీటి సద్వినియోగం
ఈ ఒప్పందాలతో గోదావరిలో హక్కుగా ఉన్న 950 టీఎంసీల నీటిని సద్వినియోగం చేసుకునే అవకాశం లభించింది. గోదావరి బ్యారేజీలపై ఇరు రాష్ర్టాలు సాంకేతిక ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఇరు రాష్ట్రాల నీటి పారుదల శాఖ మంత్రులతో పాటు అధికారులు, మంత్రులు పాల్గొన్నారు.
మూడు బ్యారేజీలపై ఒప్పందం
మహారాష్ట్ర, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర ప్రాజెక్టుల ఒప్పందాలు, భవిష్యత్తులో నిర్మించే ప్రాజెక్టులపై అంతర్రాష్ట్ర మండలి ఏర్పాటయింది. గోదావరి నదీ జలాల వివాద ట్రిబ్యునల్-1979 (తదుపరి నివేదిక 1980) పరిశీలనకు అనుగుణంగా రెండు రాష్ట్రాల మధ్య పాత, కొత్తవి కలిపి ఆరు ప్రాజెక్టులను తీసుకువచ్చారు. అందులో మూడు బ్యారేజీలపై మంగళవారం సాంకేతిక ఒప్పందం జరిగింది.
తమ్మిడిహెట్టి ఎత్తు
తమ్మిడిహట్టి, మేడిగడ్డలకు డీపీఆర్లు పూర్తయ్యాయి. తమ్మిడిహట్టి 148 మీటర్ల ఎత్తు, మేడిగడ్డ వంద మీటర్ల ఎత్తునకు ఒప్పందం కుదిరింది. చనాక-కొరాటకు సంబంధించి రెండు బ్యారేజీలకు డీపీఆర్లు పూర్తి కావల్సి ఉంది. అవి మినహా మిగిలిన వాటికి సమావేశం ఆమోదముద్ర వేశారు. మేడిగడ్డ వద్ద నిర్మించే బ్యారేజీకి సంబంధించి వంద మీటర్ల ఎత్తుపై సాంకేతిక ఒప్పందం జరిగింది.