పేలిన ట్యూబ్స్: మంత్రులు, ఎమ్మెల్యేల పరుగు
ఆదిలాబాద్: సమావేశం జరుగుతుండగా షాట్ సర్క్యూట్ కారణంగా ట్యూబ్ లైట్లు పేలడంతో ఒక్కసారిగా భయాందోళనకు గురైన మంత్రులు, ఎమ్మెల్యేలతోపాటు అధికారులు పరుగులు తీశారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో చోటు చేసుకుంది.
గురువారం మధ్యాహ్నం సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ(ఐటిడిఏ) కార్యనిర్వాహక సమావేశం జరిగింది. కాగా, సమావేశం జరుగుతుండగా.. విద్యుత్ లైన్లలో లోపాల కారణంగా తీగలకు నిప్పంటుకొని ఫ్యాన్లు కాలిపోగా, ట్యూబ్ లైట్లు పేలిపోయాయి.
దీంతో ఒక్కసారిగా భయాందోళనలకు గురైన మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జోగు రామన్నలతోపాటు సమావేశానికి హాజరైన ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు బయటికి పరుగులు తీశారు. ఈ ఘటనలో ఎవరికీ ఏమి కాకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.
మిషన్ కాకతీయలో ఉద్యమస్ఫూర్తితో పాల్గొనాలి: హరీశ్ రావు
కరీంనగర్: చెరువుల పూడికతీత కార్యక్రమంలో ఉద్యోగులతోపాటు ప్రజలంతా ఉద్యమ స్ఫూర్తితో పాల్గొనాలని మంత్రి హరీశ్రావు కోరారు. గురువారం మిషన్ కాకతీయపై ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో నీళ్లు లేక రైతులు అనేకమంది ఆత్మహత్యలు చేసుకున్నారి అన్నారు. చెరువుల పూడికతీతతో రైతాంగం అభివృద్ధిపథంలో పయనిస్తుందని చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం మూలంగా ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్వాసితులకు నష్టపరిహారం అందలేదని ఆరోపించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణానికి నోచుకోలేదని అన్నారు. అసత్యాలు మాట్లాడితే కాంగ్రెస్పార్టీ తెలంగాణలో అడ్రస్ లేకుండాపోతుందని ఆయన హెచ్చరించారు.