ఫెయిల్: మనస్తాపంతో ఇద్దరు విద్యార్థినుల ఆత్మహత్య
వరంగల్: ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపానికి గురైన ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాద ఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. వరంగల్ నగరం కాజీపేట విష్ణుపురిలో నివాసముండే పల్లగాని గురుప్రసాద్, రమ దంపతుల పెద్ద కూతురు రచన(18) నగరంలోని ఓ కళాశాలలో ఇంటర్ చదువుతోంది.
ఇటీవల ఇంటర్ సెకండియర్ పరీక్షలు రాయగా సోమవారం ఫలితాలు వెల్లడయ్యాయి. పరీక్షల్లో ఫెయిలవడంతో మనస్తాపానికి గురైన రచన ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
మరో ఘటనలో దేవరుప్పుల మండలం చిన్నమడూరుకు చెందిన రాజేందర్, జయమ్మ దంపతుల ఏకైక కూతురు రేషపల్లి ఆశ్విని(21)ని కడవెండికి చెందిన భానుచందర్కు ఇచ్చి ఏడాది క్రితం పెళ్లి చేశారు.
వివాహం తర్వాత కూడా ఆశ్విని చదువుపై ఆసక్తితో జనగామలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ఎంపీసీ ద్వితీయ సంవత్సరం చదివి పరీక్షలకు హాజరరైంది. సోమవారం ఫలితాల్లో అశ్విని ఫెయిలవడంతో మనస్తాపంతో రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ లభించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.