మళ్లీ విజృంభిస్తున్న స్వైన్ఫ్లూ: గాంధీలో ఇద్దరు మృతి
హైదరాబాద్: మరోసారి నగరంలో స్వైన్ఫ్లూ విజృంభిస్తున్నట్లు కనిపిస్తోంది. స్వైన్ ఫ్లూతో బాధపడుతూ గాంధీ చికిత్స పొందుతున్న ఇద్దరు బుధవారం మృతి చెందారు. మరో ఇద్దరు స్వైన్ ఫ్లూ బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
స్వైన్ ఫ్లూతో గత కొన్ని రోజులుగా గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జీడిమెట్లకు చెందిన మహిళ, మెదక్ జిల్లాలోని సిద్దిపేటకు చెందిన మరో వ్యక్తి బుధవారం మృతి చెందారని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. చలి తీవ్రత పెరగడం వల్లే స్వైన్ ఫ్యూ విజృంభిస్తున్నట్లు తెలుస్తోంది.
చిన్నారిని అర కిలోమీటరు లాక్కెళ్లాయి
నగర శివారు ప్రాంతాల్లో వీధి దీపాలు సరిగా వెలకగపోవడంతో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. చీకటిలో వీధిలో ఆడుకున్నందుకు ఓ చిన్నారి కుక్కల బారిన పడి తీవ్ర గాయాలపాలైంది. ఈ సంఘటన మాదన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
మాదన్నపేట చంద్రయ్య హట్స్ మురికివాడలో నివాసముండే పిట్టల రవికుమార్ కూతురు లావణ్య రాత్రిపూట ఇంటిముందు ఆడుకుంటుండగా వీధి కుక్కలు దాడి చేసి అర కిలోమీటరు దూరం లాక్కెళ్లాయి. ఈ ఘటనతో ఒకటిన్నరేళ్ల ఆ చిన్నారి కొంతసేపు చలనం లేకుండా పడిపోయింది.
రెండు చేతులు, ఎడమ కన్నుకు తీవ్ర గాయాలయ్యాయి. వీధి దీపాలు లేకపోవడంతో చీకట్లో ఏం జరిగిందో తెలియలేదు. కొంతసేపటి తర్వాత పాప గాయపడిందని తెలుసుకున్న కుటుంబసభ్యులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో స్థానికులు ఫిర్యాదు చేయడంతో బల్దియా సిబ్బంది కుక్కలను పట్టుకుని వ్యానులో తరలించారు.