ఇద్దరు ‘రౌడీ’ ఎస్సైలపై సస్పెన్షన్ వేటు
ఓ వ్యాపారిపై రౌడీల మాదిరిగా దౌర్జన్యం చేసిన ఇద్దరు ప్రొబేషనరీ ఎస్సైలను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.
ఖమ్మం: ఖమ్మంలోని ఓ వ్యాపారిపై రౌడీల మాదిరిగా దౌర్జన్యం చేసి, పిస్టలుతో బెదిరించిన ఇద్దరు ప్రొబేషనరీ ఎస్సైలను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ ఇద్దరు స్వయానా అన్నదమ్ములు.
మరిన్ని వివరాలు...
ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలానికి చెందిన బాణోత్ చంద్రయ్య, ఖమ్మంలోని ఉమెన్ పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా పని చేస్తున్నారు. ఆయన కుమారులైన రాణాప్రతాప్, మహేష్ 2014లో ఒకేసారి ఎస్సైలుగా ఎంపికయ్యారు.
ప్రస్తుతం ప్రొబేషనరీ పీరియడ్ లో ఉన్నారు. వీరిలో రాణాప్రతాప్.. మహబూబాబాద్ జిల్లాలో ఎస్ఓటీ ఎస్సైగా, మహేష్.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో స్పషల్ పార్టీ ఎస్సైగా పనిచేస్తున్నారు.
ఆ రోజు ఏం జరిగిందంటే...
ఆరు రోజుల కిందట, ఖమ్మం బస్టాండులో మహేష్ బస్సు దిగాడు. సివిల్ డ్రెస్సులో ఉన్నాడు. బస్టాండ్ కాంప్లెక్సులోగల బాంబే ఫుట్ వేర్ షాపులో నుంచి అవతలి రోడ్డుకు వెళుతున్నాడు. అతడెవరో ఆ షాపు యజమాని ఖాద్రీకి తెలియదు. ఆయన చాలా మర్యాదగా.. ''సార్, మాకు వ్యాపారం జరిగే ఈ సమయంలో ఇటు నుంచి రాకూడదు. మీరు వేసుకున్న బూట్లకు కూడా బురద ఉంది'' అన్నారు. దీనిని మహేష్ జీర్ణించుకోలేకపోయాడు. ఆ షాపు యజమానితో వాదనకు దిగాడు. ఆ తరువాత వెళ్లిపోయాడు.
రౌడీల్లా ప్రవర్తించారు
Recommended Video
శనివారం రాత్రి. ఎస్సలైన మహేష్, ఆయన సోదరుడు రాణాప్రతాప్ కలిసి సివిల్ డ్రెస్సులో శనివారం రాత్రి ఆ షాపుకు వచ్చారు. వచ్చీ రావడంతోనే ఆ షాపు యజమాని ఖాద్రీతో.. ''మేం స్పెషల్ బ్రాంచ్ ఎస్సైలం. నీపై నిఘా వేశాం. స్టేషనుకు నడువ్. షాపు షట్టర్ దించు'' అని దుర్భాషలాడారు. తాను చేసిన తప్పేమిటని, నిఘా ఎందుకు వేశారని, స్టేషనుకు ఎందుకు రావాలని ఆ షాపు యజమాని ప్రశ్నించాడు. దీంతో అతడిపై ఆ ఇద్దరు ఎస్సైలు దౌర్జన్యానికి దిగారు. పిస్టల్ తీసి, చంపుతామంటూ బెదిరించారు. ఇంతలో అక్కడికి చుట్టుపక్కల వ్యాపారులు వచ్చారు. అంతా కలిసి ఆ ఇద్దరు ఎస్సైలను నిలదీశారు. వారిపై కూడా ఆ ఎస్సైలు దురుసుగా ప్రవర్తించారు.
డీజీపీకి చెప్పకున్నా ఏం కాదు... డీఎస్పీకి సమాచారమిద్దామని ఆ వ్యాపారులు
చర్చించుకుంటుండగా విని.. ''డీఎస్పీకి చెప్పకుంటారో, డీజీపీకి చెప్పుకుంటారో చెప్పుకోండి. మేం స్పెషల్ బ్రాంచ్ ఎస్సైలం. మాకేం కాదు'' అంటూ జులుం ప్రదర్శించారు. మరికొందరు వ్యాపారులు కూడా రావడంతో చిన్నగా అక్కడి నుంచి జారుకున్నారు. కొద్దిసేపటి తరువాత స్థానిక ముస్లిం పెద్దలు, వన్ టౌన్ సీఐ రహమాన్ వచ్చారు.
సీసీ కెమెరాల్లో నమోదు
ఆ షాపులోకి ఆ ఇద్దరు ఎస్సైలు వచ్చి ఎలా రౌడీయిజం చేసిందీ.. అక్కడున్న సీసీ కెమెరాల్లో నమోదైంది. వీటి ఆధారంగా ఆ ఇద్దరిని పోలీసులు గుర్తించారు.
వేటు పడింది
ఈ ఇద్దరు ఎస్సైల రౌడీయిజం, సీసీ కెమెరాల్లోని చలన చిత్రాలు టీవీ మాధ్యమాల్లో ప్రసారమయ్యాయి. విషయం ఉన్నతాధికారుల వద్దకు వెళ్లింది. ఆ ఇద్దరు ఎస్సైలను 24 గంటల్లోపే సస్పెండ్ చేశారు.
కేసులు నమోదు
షాపు యజమాని ఖాద్రీ ఫిర్యాదుతో ఆ ఇద్దరు ఎస్సైలపై 448, 323, రెడ్విత్ ఆర్మ్స్ 27 సెక్షన్ల కింద ఖమ్మం వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. అకారణ దాడి, పిస్టల్ దుర్వినియోగం అభియోగాలపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు.
అరెస్టుకు రంగం సిద్ధం
ప్రస్తుతం పరారీలో ఉన్న ఆ ఇద్దరు ఎస్సైలను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమైంది.