నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు, 4 నుంచి 7 డిగ్రీలు పెరిగిన ఉష్ణోగ్రత
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు నిప్పుల కొలిమిలా మండుతున్నాయి. ఉష్ణోగ్రతల తీవ్రత సాధారణం కంటే 4 నుంచి 7 డిగ్రీల మేర పెరిగినట్టు వాతావరణ శాఖ తెలిపింది.
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతల తీవ్రత కొనసాగుతోంది. భానుడి భగభగలకు ప్రజలు విలవిలలాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు నిప్పుల కొలిమిలా మండుతున్నాయి.
దీనికితోడు వాయువ్య భారత్నుంచి వీస్తున్న వేడి గాలులు వేడిమిని మరింతగా పెంచుతున్నాయి. దీంతో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలతో పాటు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వడగాల్పులు వీస్తున్నాయి.
ఉష్ణోగ్రతల తీవ్రత సాధారణం కంటే 4 నుంచి 7 డిగ్రీల మేర పెరిగినట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈ ఎండల తీవ్రతకు ఉక్కపోత పరిస్థితులు నెలకొన్నాయి. రాత్రి పది గంటలకు కూడా వడగాల్పులు తగ్గకపోవడంతో బయటకు రావాలంటేనే ప్రజలు జంకుతున్నారు.
కృష్ణా జిల్లా తిరువూరులో 47.65 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే కంచికచర్ల, నున్న, జి.కొండూరు, పెనుగంచిప్రోలులో కూడా 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే... గుంటూరు జిల్లా కొల్లిపర, పెదాకాకానిలో 47.65 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా బల్లికురవ మండలం కొప్పెరపాడులో47.08 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం విశేషం.
కోస్తాంధ్ర, రాయలసీమలోని ఆయా ప్రాంతాల్లో మరో రెండు రోజులపాటు తీవ్ర వడగాల్పులు వీస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. తెలంగాణలోని ఆయా ప్రాంతాల్లో రెండు నుంచి ఐదు రోజులపాటు వడగాల్పులు వీచే అవకాశముందని తెలిపారు.
మరోవైపు కోస్తాంధ్ర, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో క్యూములోనింబస్ మేఘాల కారణంగా ఉరుములు, పిడుగులతో కూడిన జల్లులు పడటంతో ఆయా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కాస్త దిగివచ్చాయి.
అయితే ఈ ఉష్ణోగ్రతల తీవ్రత మరో రెండు మూడు రోజులు కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. ప్రత్యేకించి వాయువ్యం నుంచి వీస్తున్న ఉష్ణగాలుల ప్రభావం గుంటూరు, కృష్ణా జిల్లాలతో పాటు ప్రకాశం జిల్లాలోని పలుచోట్ల నేరుగా పడుతోందని వాతావరణశాఖ తెలిపింది.