కెసిఆర్ సభ విషాదం: టిఆర్ఎస్ కార్యకర్తల మృతి
హైదరాబాద్: బహిరంగ సభ ముగిసిన తర్వాత జాగ్రత్తగా ఇళ్లకు చేరుకోవాలని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు పదే పదే చెప్పినప్పటికీ విషాదం తప్పలేదు. హైదరాబాద్లో సోమవారం నిర్వహించిన టీఆర్ఎస్ బహిరంగ సభకు హాజరై తిరిగి వెళ్తుండగా జరిగిన ప్రమాదాల్లో ఇద్దరు కార్యకర్తలు మృతిచెందారు.
ఖమ్మం జిల్లా కొత్తగూడెం మండలం వేమచంద్రాపురానికి చెందిన ముత్యాల హనుమయ్య(52) సభకు హాజరై తిరుగు ప్రయాణమయ్యారు. హయత్నగర్ వద్ద టీ తాగేందుకు బస్సు ఆపారు. రోడ్డుకు అవతలి వైపు వెళ్లి టీ తాగి తిరిగి బస్సు ఎక్కేందుకు వస్తూ రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందారు.
సమాచారం అందుకున్న మంత్రి హరీశ్రావు, పార్లమెంటరీ కార్యదర్శి జలగం వెంకటరావులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని సందర్శించారు. పార్టీపరంగా మృతుడి కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మృతుడికి ముగ్గురు పిల్లలు ఉన్నారు.
మరో ఘటనలో సభకు హాజరయ్యేందుకు మహబూబ్నగర్ జిల్లా ధన్వాడ మండలం, కొండాపూర్కు చెందిన డీ గోపాల్ ఇతర కార్యకర్తలతో కలిసి వాహనంలో బయలుదేరారు. షాద్నగర్ బైపాస్లో కొద్దిసేపు వాహనాన్ని ఆపారు. వాహనం దిగి నిల్చున్న గోపాల్ను హైదరాబాద్ వెళ్లే డీసీఎం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందారు. మృతుడి కుటుంబాన్ని అన్నివిధాలుగా ఆదుకుంటామని ఎంపీ జితేందర్రెడ్డి హామీ ఇచ్చారు.
నిజామాబాద్ మండలంలోని ముదక్పల్లికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్తలు బస్సులో హైదరాబాద్కు బయలుదేరుతుండగా సదాశివనగర్ మండలంలోని దగ్గి ప్రాంతంలో స్వల్ప ప్రమాదానికి గురైంది. వరుసగా వెళ్తున్న వాహనాల్లో స్కార్పియో నడుపుతున్న డ్రైవర్ ఒక్కసారిగా బస్సు ముందుకెళ్లి బ్రేకు వేశాడు. నిజామాబాద్-2 డిపో బస్సు డ్రైవర్ సైతం హఠాత్తుగా బ్రేక్ వేయడంతో బస్సులోని 48 మంది కార్యకర్తలకు స్వల్ప గాయాలయ్యాయి.