కెసిఆర్కు చెత్తతో అభిషేకం, ఎసిబి వేధిస్తున్నారు: ఓటుకు నోటు నిందితుడు ఉదయ్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు ఖమ్మం జిల్లాలో పారిశుద్ద్య కార్మికులు చెత్తతో అభిషేకం చేశారు. తమ డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ కార్మికులు కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.
శుక్రవారం నాడు ముఖ్యమంత్రి కెసిఆర్ ఫోటోకు కార్మికులు చెత్తతో అభిషేకం చేశారు. అనంతరం బురదతోను కడిగారు. మరోవైపు, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తొలగించిన పారిశుద్ధ్య కార్మికులను వెంటనే తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ చేపట్టిన దీక్ష కొనసాగుతోంది.
21, 22 తేదీల్లో హైదరాబాదులో రాహుల్ గాంధీ పర్యటన
ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ ఆగస్టు 21, 22 తేదీల్లో తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు. తెలుగు రాష్ట్రాలలో రాహుల్ వెంటవెంటనే పర్యటనలు చేస్తూ క్యాడర్లో ఉత్సాహం నింపుతున్నారు. తెలంగాణ పర్యటనలో ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులతో భేటీ కానున్నారు. వరంగల్ జిల్లా భూపాలపల్లిలోను పర్యటిస్తారు.
ఎసిబి అధికారులపై ఉదయ్ సిన్హా ఫిర్యాదు
ఓటుకు నోటు కేసులో ఏ3 నిందితుడు ఉదయ్ సిన్హా శుక్రవారం నాడు ఎసిబి డిజి ఏకే ఖాన్ను కలిశారు. తనను ఎసిబి అధికారులు వేధిస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఓటుకు నోటు కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన విషయం తెలిసిందే.