కేసీఆర్కు బాబు ఊహించని షాక్: ఆ ఉద్యోగులను చేర్చుకోం.. జీతాలు మీరే ఇవ్వాలి!
తెలంగాణ ప్రభుత్వం వారిని రిలీవ్ చేసిన సమయంలో.. తిరిగి చేర్చుకోవడానికి ఒప్పుకున్న ఏపీ ప్రభుత్వం.. ఇప్పుడిలా మాట మార్చడం గమనార్హం.
హైదరాబాద్: తెలంగాణ సర్కార్కు ఏపీ ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వ పరిధి నుంచి రిలీవ్ అయిన 24మంది సెక్షన్ ఆఫీసర్స్(ఎస్.వో)ను తమ ప్రభుత్వం చేర్చుకోదని తేల్చి చెప్పింది. అంతేకాదు, ఐదు నెలలుగా పెండింగ్ లో ఉన్న వీరి వేతన బకాయిలను కూడా తెలంగాణ ప్రభుత్వమే చెల్లించాలని కొలికి పెట్టింది.
ఈ మేరకు ఆ ఆఫీసర్స్ ను తిరిగి వెనక్కి పంపిస్తున్నట్లుగా ఏపీ సర్కార్ తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది. అయితే తెలంగాణ ప్రభుత్వం వారిని రిలీవ్ చేసిన సమయంలో.. తిరిగి చేర్చుకోవడానికి ఒప్పుకున్న ఏపీ ప్రభుత్వం.. ఇప్పుడిలా మాట మార్చడం గమనార్హం. మరో వెైపు 9నెలల క్రితం ఏపీ ప్రభుత్వం రిలీవ్ చేసిన 42మంది ఎస్వోలు, 16 మంది ఏఎస్వోలను తెలంగాణ ప్రభుత్వం చేర్చుకుంది. నాలుగు నెలల పాటు వీరి పోస్టింగ్స్ వెయిటింగ్ లో ఉన్నందువల్ల.. ఆ జీతాలను కూడా తెలంగాణ ప్రభుత్వమే భరించింది.
కానీ ఏపీ ప్రభుత్వ తీరు మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. ఏపీ స్థానికత కలిగిన 24 మంది ఎస్వోలను తెలంగాణ ప్రభుత్వం గత జనవరి 30న రిలీవ్ చేసిన సమయంలో.. వారిని ఏపీ పరిధిలోకి తీసుకుంటామని అక్కడి ప్రభుత్వం హామి ఇచ్చింది. తీరా ఇప్పుడిలా మాట మార్చడంతో తెలంగాణ ఉద్యోగులు ఏపీ ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారు.
ఏపీ స్థానికత కలిగిన ఉద్యోగులను చేర్చుకోకపోవడానికి అక్కడి సర్కార్ మరో కారణాన్ని చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వ కింద ప్రస్తుతం 230మంది తెలంగాణ స్థానికత కలిగిన ఉద్యోగులు ఉన్నారు. వీరంతా గ్రేడ్-4 ఉద్యోగులే. వీరిని గనుక తెలంగాణ ప్రభుత్వం చేర్చుకుంటేనే.. రిలీవ్ అయిన 24మంది సెక్షన్ ఆఫీసర్స్(ఎస్.వో)ను తమ వద్ద చేర్చుకోవాలని ఏపీ ప్రభుత్వం యోచిస్తోంది. దీనికి సంబంధించిన ఫైల్ తెలంగాణ సీఎం కేసీఆర్ వద్ద పెండింగ్ లో ఉందని చెబుతున్నారు. ఆ ఫైల్ ముందుకు కదిలితేనే ఈ సమస్య ఒక పరిష్కారానికి వస్తుందోమో!
కాగా, తెలంగాణ ప్రభుత్వం నుంచి రిలీవ్ అయిన ఉద్యోగులంతా.. తమకిచ్చిన ఆప్షన్స్ లో ఆంధ్రానే ఎంచుకోవడంతో వీరిని రిలీవ్ చేయక తప్పలేదు. వీరి స్థానంలో తెలంగాణ సెక్రటేరియట్ లో పనిచేస్తున్న ఏఎస్వోలకు పదోన్నతులు కల్పించింది.