విద్యార్ధుల ఆచూకీ లభ్యం: హైదరాబాద్లో అదృశ్యమై గోవాలో ప్రత్యక్షం
హైదరాబాద్: హైదరాబాద్లోని ఎల్బీ నగర్కు చెందిన ఉప్పల్ కేంద్రీయ విద్యాలయం విద్యార్థుల ఆచూకీ పోలీసులకు లభ్యమైంది. విద్యార్థుల వద్ద సెల్ఫోన్ ఆధారంగా వారు గోవా రాజధాని పనాజీకి చేరుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం...
ఎల్బీ నగర్లోని శివగంగానగర్ కాలనీకి చెందిన నలుగురు విద్యార్ధులు మంగళవారం సాయంత్రం అదృశ్యం కావడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఉప్పల్లోని కేంద్రీయ విద్యాలయంలో తొమ్మిదో తరగతి చదువుతున్న సాయినాథ్రెడ్డి, లికిత్కుమార్, విజయ్కుమార్, సాయికుమార్ స్కూల్ అయిపోగానే వారి ఇళ్లకు వెళ్లి ఆ తరువాత కనిపించకుండా పోయారు.
దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు సమీపంలోని పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. బుధవారం కేంద్రీయ విద్యాలయానికి వెళ్లిన విద్యార్ధుల తల్లిదండ్రులు తోటి స్నేహితులను విచారించగా అగస్టు 14 నుంచి గోవా, బెంగళూరు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నారని వారికి తెలిసింది.
స్కూల్ నుంచి బయటికి వెళ్లిన తర్వాత ఎరుపు రంగు మారుతి వ్యానులో ఘట్కేసర్ వైపు వెళ్లినట్లు తెలిసింది. విద్యార్థులు గోవా వెళ్లాలని మాట్లాడుకున్నట్లు పాఠశాలలో వారి సహ విద్యార్థులు పోలీసులకి చెప్పారు. దీంతో ఆ దిశగా విచారణ చేపట్టిన పోలీసులు ఎట్టకేలకు విద్యార్థుల ఆచూకీ కనుగొన్నారు.
విద్యార్థుల వద్ద ఉన్న సెల్ఫోన్ ఆధారంగా పోలీసులు ప్రస్తుతం వారు మహారాష్ట్ర ప్రాంతంలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీరిలో విజయ్కుమార్ అనే విద్యార్థి ఇంట్లో నుంచి రూ. 4వేల నగదు, బంగారు నగలు తీసుకెళ్లినట్లు పోలీసులు విచారణలో గుర్తించారు.