'కేసీఆర్ ఇఫ్తార్ వెనుక ప్లాన్!', 'కిషన్.. తెలంగాణ పట్ల కేంద్రం పక్షపాతం'
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మండలిలో కాంగ్రెస్ పక్ష నేత షబ్బీర్ అలీలు శుక్రవారం నాడు మండిపడ్డారు. ముస్లీంలకు ఇచ్చిన ఎన్నో హామీలను కెసిఆర్ తుంగలో తొక్కారన్నారు.
రంజాన్ నాటికి రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారని, ఆ హామీ ఏమయిందని ప్రశ్నించారు. ఉద్యోగాల నోటిఫికేషన్ల కంటే ముందే రిజర్వేషన్లు ఇవ్వాలన్నారు. ఇంతవరకు వక్ఫ్ బోర్డుకు అధికారాలు ఇవ్వలేదని విమర్శించారు. అన్యాక్రాంతమైన భుములను స్వాధీనం చేసుకోవాలన్నారు.
షాదీ ముబారక్ పథకం కేవలం నినాదంగానే మిగిలిపోయిందన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే కెసిఆర్ ఇఫ్తార్ విందు ఇస్తున్నారని ఆరోపించారు. ముస్లీం రిజర్వేషన్ల హామీని మరిచిపోయారా అన్నారు. రిజర్వేషన్లు అడుగుతుంటే ఇఫ్తార్ విందులేమిటని ప్రశ్నించారు. ఆలేరు ఎన్ కౌంటర్ పైన సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
కిషన్ రెడ్డి సాక్ష్యాధారాలుంటే చెప్పు: ఇంద్రకరణ్
పుష్కరాల ఏర్పాట్లలో అక్రమాలు జరిగాయంటూ బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. అక్రమాలు జరిగినట్లు సాక్ష్యాధారాలు ఉంటే ప్రభుత్వానికి అందజేస్తే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.
తెలంగాణ పట్ల కేంద్రం పక్షపాత ధోరణి అవలంభిస్తోందన్నారు. ఆంధ్ర, మహారాష్ట్రకు రూ.100 కోట్ల చొప్పున కేటాయించిన కేంద్రం తెలంగాణకు మాత్రం రూ.50 కోట్లు కేటాయించిందన్నారు. కిషన్ రెడ్డి కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి రాష్ర్టానికి ఎక్కువ నిధులు వచ్చేలా చూడాలన్నారు. సమైక్య రాష్ట్రంలో మొత్తం 27 ఘాట్లు ఉంటే ఇప్పుడు తెలంగాణలోనే 106 ఘాట్లు ఏర్పాటు చేశామన్నారు.