‘కరీంనగర్ నుంచే కేసీఆర్ పతనం’: పొన్నం దీక్ష భగ్నం
మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ చేస్తున్న ఆమరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. కరీంనగర్ నగరంలో వైద్యకళాశాల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ గత నాలుగురోజులుగా దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే.
కరీంనగర్: నగరంలో వైద్యకళాశాల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ గత నాలుగురోజులుగా మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ చేస్తున్న ఆమరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఇందిరాచౌక్లో ఆమరణదీక్ష చేయడానికి పోలీసులు అనుమతించకపోవడంతో తన ఇంటి ముందే ఆగస్టు 5వతేదీ నుంచి పొన్నం ఆమరణ దీక్షకు పూనుకున్నారు. కరీంనగర్ నుంచి సిరిసిల్ల-వేములవాడ వెళ్లే రహదారికి అడ్డుగా దీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేసి కొనసాగించారు.
పొన్నం ప్రభాకర్ దీక్షకు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి సహా అనేక మంది నాయకులు వివిధ సంఘాలు సంఘీభావం ప్రకటించాయి. దీక్ష నాలుగోరోజుకు చేరుకున్న క్రమంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. మంగళవారం తెల్లవారుజామున నాలుగున్నర ప్రాంతంలో భారీగా తరలివచ్చిన పోలీసులు పొన్నం ప్రభాకర్ను అరెస్టు చేసేందుకు యత్నించిన క్రమంలో కొంత ఉద్రిక్తత చోటుచేసుకొంది.
కమిషనరేట్ పధిలోని పోలీసులు పెద్దయెత్తున తరలివచ్చి పొన్నం ప్రభాకర్ను హుటాహుటిన ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్సకోసం ఐసీయులోకి చేర్పించగా ఆయన చికిత్సకు నిరాకరించారు.ముఖ్యమంత్రి భేషజాలకు పోకుండా వెంటనే వైద్యకళాశాల మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. సీఎం కళాశాలకు ఎన్ఓసీ ఇస్తే తానే స్వయంగా కలిసి అభినందనలు చెబుతానన్నారు.
కేసీఆర్ పతనం ఇక్కడ్నుంచే: ఉత్తమ్
అభివృద్ధి విషయంలో అనేక హామీలిచ్చి అమలు చేయక, పలు అంశాలపై అబద్ధాలు మాట్లాడుతూ ప్రజలను మోసగిస్తున్న సీఎం కేసీఆర్కు కరీంనగర్ నుంచే పతనం ప్రారంభమవుతుందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి హెచ్చరించారు. కరీంనగర్లో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ చేపట్టిన ఆమరణ దీక్షను సోమవారం సందర్శించి మద్దతు ప్రకటించారు.
ఉత్తమ్ మాట్లాడుతూ కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో ఓడిపోతానన్న భయంతోనే అబద్ధాలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఆయన కుమారుడు కేటీఆర్ను ప్రజలు గమనిస్తున్నారన్నారు. దళితులు, రైతులు, పేదలు, మైనార్టీలు కోర్టుకు వెళ్తే భరించలేని కేసీఆర్.. జీఎస్టీ విషయంలో కోర్టుకు ఎలా వెళతానంటున్నారని ప్రశ్నించారు. విద్యుత్తు కార్మికుల క్రమబద్ధీకరణ, సింగరేణి వారసత్వ ఉద్యోగాల విషయంలో కోర్టు కేసులకు కాంగ్రెస్కు సంబంధం లేదని, విద్యుత్తు ఉద్యోగాల కేసు వాదించిన న్యాయవాది తెరాసకు చెందిన వారని స్పష్టంచేశారు.
నేదునూర్ గ్యాస్ ఆధారిత విద్యుత్తు ప్రాజెక్టుకు అప్పటి సీఎం రోశయ్య శంకుస్థాపన చేస్తే నాడు తెరాస నాయకులు పిండప్రదానం చేశారని, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. నాడు తన తండ్రి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని అప్పటి లోక్సభ స్పీకర్ మీరాకుమార్ను వేడుకున్న కవిత..నేడు ఆమెను అవహేళన చేయడం ఎంతవరకూ సబబన్నారు.
శాసనమండలి పక్ష నాయకుడు షబ్బీర్అలీ మాట్లాడుతూ కేసీఆర్ వూసరవెల్లిలా రోజుకో మాట మారుస్తున్నారని మండిపడ్డారు. శాసనసభపక్షనేత జీవన్రెడ్డి మాట్లాడుతూ జానారెడ్డి మాట్లాడితే జీఎస్టీ విషయంలో అప్పుడు మాట్లాడవద్దన్న కేసీఆర్ ఇప్పుడు ఏం జవాబిస్తారన్నారు. మాజీ మంత్రులు సుద్దాల దేవయ్య, రాంచంద్రారెడ్డి, చిత్తరంజన్దాస్, మాజీ ఎంపీలు మల్లు రవి, రాజయ్య, నిజామాబాద్, నల్గొండ, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల పార్టీ అధ్యక్షులు తాహేర్, భిక్షమయ్యగౌడ్, నర్సింగ్యాదవ్, మృత్యుంజయం పాల్గొన్నారు.