మమ్మల్ని గెంటేశారు: కెసిఆర్పై ఉత్తమ్, కెసిఆర్పై రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్య
మెదక్: రైతు సమస్యల పైన తాము అసెంబ్లీలో నిలదీస్తే తమను గెంటేశారని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి మంగళవారం నాడు టిఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. మెదక్ జిల్లా తూఫ్రాన్లో తెలంగాణ కాంగ్రెస్ నేతలు రైతు భరోసా యాత్ర నిర్వహించారు.
ఈ యాత్రలో ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు మల్లు భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహ తదితరులు పాల్గొన్నారు. ఇస్మాన్పూర్లో ఆత్మహత్య చేసుకున్న వెంకటేశ్ అనే రైతు కుటుంబాన్ని నేతలు పరామర్శించారు. కాంగ్రెస్ పార్టీ తరపున ఆ కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సాయం అందించారు.
ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా మెదక్లోనే ఎక్కువగా రైతు ఆత్మహత్యలు జరిగాయన్నారు. బాధిత రైతు కుటుంబాలన్నింటికి రూ.6 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి కెసిఆర్ రైతు కుటుంబాలకు ఏమాత్రం భరోసా కల్పించలేకపోయారన్నారు. ఏకకాలంలో రుణాలు మాఫీ చేయాలన్నారు. అప్పుడే రైతు ఆత్మహత్యలు ఆగుతాయని చెప్పారు. ఆత్మహత్య చేసుకున్న 1400 రైతు కుటుంబాలన్నింటికీ పరిహారం ఇవ్వాలన్నారు.
నలుగురే రాష్ట్రంగా వ్యవహారం నడుస్తోందని తెలంగాణ టిడిపి నేత రేవంత్ రెడ్డి వేరుగా అన్నారు. రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ ఏకకాలంలో అనే డిమాండ్ అలవికాని కోరిక ఏమీకాదన్నారు. రాష్ట్రంలో సన్నబియ్యం మాఫియా కొనసాగుతోందన్నారు. బియ్యం ముసుగులో విద్యార్థుల ఆరోగ్యం దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు.
ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం హాస్టల్ విద్యార్థులకు సన్నబియ్యం బదులు దొడ్డు బియ్యం పెడుతూ బియ్యం మాఫియాకు పాల్పుడుతోందని రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని ఎక్కడైనా నిరూపించేందుకు తాను సిద్ధమని సవాల్ చేశారు. లేకుంటే ఎలాంటి శిక్షకైనా సిద్ధమన్నారు.
కలెక్టర్లు, ఎస్పీలతో టీఎస్ సీఎం కేసీఆర్ సమావేశం
రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు భేటీ అయ్యారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి పలువురు మంత్రులు, అధికారులు హాజరయ్యారు. రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం, ప్రాజెక్టుల భూసేకరణ, జలహారం, హరితహారం, భూముల వేలం, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అంశాలపై అధికారులతో సమీక్షిస్తున్నారు.
రాష్ర్టానికి ఆరుగురు ప్రొబెషనరీ ఐఏఎస్ల కేటాయింపు
రాష్ర్టానికి ఆరుగురు కొత్త ఐఏఎస్ అధికారులు రానున్నారు. ఆరుగురు ప్రొబెషనరీ ఐఏఎస్ అధికారులను కేంద్రం రాష్ట్రానికి కేటాయించింది. ఈమేరకు ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. వీళ్లంతా 2014 ఐఏఎస్ బ్యాచ్కు చెందినవారు.