రాహుల్ వస్తున్నారనే: పిసిసి చీఫ్, ఉత్తమ్ను కల్సిన నటుడు జయప్రకాశ్
హైదరాబాద్: తమ పార్టీ నేత రాహుల్ గాంధీ తెలంగాణకు వస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసిందని తెలంగాణ పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి సోమవారం అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ పాలన పైన ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ నెల 21, 22 తేదీల్లో రాహుల్ గాంధీ పర్యటన ఉండవచ్చునని చెప్పారు. ఈ నెల 18వ తేదీ నుంచి జిహెచ్ఎంసీలో పాదయాత్రలు ఉంటాయని చెప్పారు. 5-14 వరకు వరంగల్ లోకసభ నియోజకవర్గంలో సమావేశాలుంటాయన్నారు.
పిసిసి కార్యవర్గాన్ని 30 మందికే పరిమితం చేస్తామని చెప్పారు. వరంగల్ లోకసభ స్థానంలో ఇంఛార్జిగా మాజీ ఉప ముఖ్యమంత్రి దామోతర రాజనర్సింహను నియమించనున్నట్లు చెప్పారు.
ఉత్తమ్ను కలిసిన నటుడు జయప్రకాశ్ రెడ్డి
తెలంగాణ పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డిని సినీ నటుడు జయప్రకాశ్ రెడ్డి సోమవారం కలిశారు. అలెగ్జాండర్ నాటక ప్రదర్శనకు రావాలని ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఆహ్వానించారు. మర్యాదపూర్వకంగానే కలిశానని, రాజకీయ పరమైన కారణాలు లేవని చెప్పారు.
17న కాంగ్రెస్ పార్టీలోకి జగ్గారెడ్డి
సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి (జగ్గారెడ్డి) ఈ నెల 17వ తేదీన కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. పిసిసి చీఫ్ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.