అప్పుల తెలంగాణ చేశారు: ఉత్తమ్ ఫైర్, స్పీకర్ చైర్లో కొండా సురేఖ ప్రత్యక్షం!
తెలంగాణను అప్పుల తెలంగాణ చేశారని, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడీని తలపిస్తోందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి అన్నారు. ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ఈరోజు
హైదరాబాద్: తెలంగాణను అప్పుల తెలంగాణ చేశారని, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడీని తలపిస్తోందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి అన్నారు. ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ఈరోజు ద్రవ్య వినిమయ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టారు. దీనిపై జరిగిన చర్చ సందర్భంగా ఉత్తమ్కుమార్రెడ్డి ప్రభుత్వం తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు.
బడ్జెట్ పద్దుల విషయంలో కొంత ఎక్కువ చేసి చూపిస్తున్నట్లు ఉందని ఉత్తమ్ అన్నారు. రాష్ట్రంలో క్రమంగా అప్పులు పెరిగిపోతున్నాయని.. ఈ నాలుగేళ్లలోనే రెట్టింపు అప్పులు పెరిగాయన్నారు. 2017-18 నాటికి రాష్ట్ర అప్పులు రూ.1,40,523కోట్లకు చేరాయని.. ఇంత భారీ మొత్తంలో అప్పులు రాష్ట్రానికి మంచిది కాదన్నారు.
విడతల వారీ రుణమాఫీ వల్ల రైతులకు ప్రయోజనం కలగడం లేదన్నారు. రైతులపై వడ్డీ భారం పడకుండా చేస్తామని సీఎం హామీ ఇచ్చి మూడు నెలలైనా నెరవేరలేదన్నారు. రాష్ట్రంలో పౌల్ట్రీ, పాడి రంగాలు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని తెలిపారు. ఎన్నికల హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. 3ఎకరాల భూమి, రిజర్వేషన్లు, డబుల్ బెడ్రూం ఇళ్లు లాంటి హామీలు నెరవేరడం లేదని అన్నారు.
అప్పులు తీర్చేస్తాం: కేసీఆర్
రాష్ర్ట ప్రభుత్వం అప్పులు తీసుకోవడమే కాదు తిరిగి చెల్లిస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. సభలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం మాట్లాడారు. ఈ ఏడాది రూ. 20 వేల కోట్ల అప్పులు తీరుస్తామని తెలిపారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితి బాగుందన్నారు. రాష్ర్టం ఇంకా అభివృద్ధి చెందుతుందన్నారు. రాష్ర్టంలో 15 శాతం వృద్ధిరేటు ఉంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారని పేర్కొన్నారు.
స్పీకర్ చైర్లో కొండా సురేఖ
శాసనసభ స్పీకర్ చైర్లో టిఆర్ఎస్ ఎమ్మెల్యే కొండా సురేఖ దర్శనమిచ్చారు. ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ జరుగుతుండగా.. కొండా సురేఖ సభా కార్యకలాపాలను నిర్వహించారు. కొండా సురేఖ ప్యానల్ స్పీకర్గా విధులు నిర్వర్తించారు.
ద్రవ్య వినిమయ బిల్లుపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతుండగా చైర్లో సురేఖ ఉన్నారు. సభ ప్రారంభమైనప్పుడు చైర్లో స్పీకర్ మధుసూదనాచారి ఉన్నారు. రెండు గంటల తర్వాత మధుసూదనాచారి సభ నుంచి వెళ్లిపోయారు. డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్రెడ్డి సభలో లేకపోవడంతో కొండా సురేఖ ప్యానల్ స్పీకర్గా వ్యవహరించారు.