ప్రేయసి కోసం విమానం హైజాక్ డ్రామా ఆడిన వంశీ లీలలు ఎన్నో...
ప్రేయసిని నమ్మించడానికి విమానం హైజాక్ నాటకం ఆడిన వంశీకృష్ణ లీలలు ఒక్కటొక్కటే వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఆశ్చర్యకరమైన విషయం వెలుగు చూసింది.
హైదరాబాద్: ప్రేయసిని నమ్మించడదానికి విమానాల హైజాక్ నాటకం ఆడిన వంశీకృష్ణ లీలలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. వంశీకృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారనే వార్తలు రావడంతో అతడితో పరిచయాలున్న కొందరు యువతులు తమను మోసం చేసిన వైనంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు
ఇదిలావుంటే, తన అధ్యాపకురాలికే అతను టోపీ వేశాడు. బీకాంలో చదువు చెప్పిన ఓ అధ్యాపకురాలి వద్ద డబ్బులు తీసుకొని వంశీకృష్ణ మోసం చేశాడని విశాఖపట్నం పోలీసులు టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాజావెంకట్రెడ్డికి ఫోన్ చేశారు.
కండీషన్లో ఉన్న కారు తక్కువ ధరకే ఇస్తానంటూ చెప్పి రూ.లక్ష స్వాహా చేశాడని ఆయనకు వివరించారు. వంశీకృష్ణను పీటీ వారెంట్తో తమతో తీసుకెళ్లి అరెస్ట్ చేసేందుకు విశాఖ, ముంబై పోలీసులు సిటీ పోలీసు అధికారులను సంప్రదించారు.
సోషల్ మీడియాలో తన ఫొటో పెట్టి ధనవంతుడిగా చూపించకుంటూ యువతులకు వల వేసేవాడు. వారితో సంభాషిస్తూ చిన్న చిన్న కానుకలు ఇస్తూ తన వైపు తిప్పుకునేవాడు. దాదాపు పదిహేను మంది వంశీకృష్ణతో సంబంధాలు పెట్టుకున్నట్లు సమాచారం. అతడితో కలిసి వేర్వేరుగా వారాంతాల్లో విందులు, వినోదాల్లో పాల్గొన్నారని కూడా సమాచారం.
విశాఖలో తాను చదివిన డిగ్రీ కళాశాలలో టీచర్కు ఆరునెలల క్రితం ఫోన్ చేశాడు. తన స్నేహితుడు కారు తక్కువ ధరకు విక్రయిస్తున్నాడని, మీకు ఇప్పిస్తే సంతోషంగా ఉంటుందని చెప్పాడు. ఆమె అంగీకరించడంతో కారుతో వస్తున్నానంటూ సమాచారమిచ్చాడు.
విజయవాడ దాటిన తర్వాత తన స్నేహితుడికి అత్యవసరంగా రూ.లక్ష అవసరమని అబద్ధాలు చెప్పి తన ఖాతాలో ఆన్లైన్ ద్వారా రూ.లక్ష జమ చేయించుకున్నాడు. డబ్బు ఖాతాలో పడిందో లేదో ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడు. తర్వాత రెండు, మూడు రోజులకు సదరు టీచర్ ఫోన్ చేస్తే స్పందన లేదు. దీంతో ఆమె వైజాగ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. పోలీసులు ఒకసారి ఫోన్ చేస్తే సిమ్కార్డునే మార్చేశాడు.