తెలంగాణ, ఎపి నడుమ వెంకయ్య: ప్రత్యేక హోదా, హైకోర్టు విభజన
హైదరాబాద్: నారీ నారీ నడుమ మురారీ అన్నట్లుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య కేంద్ర మంత్రి, బిజెపి సీనియర్ నేత ఎం. వెంకయ్య నాయుడు నలిగిపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇరు రాష్ట్రాల సమస్యలు కూడా ఆయనకు తలబొప్పి కట్టిస్తున్నట్లు అనిపిస్తోంది. రెండు రాష్ట్రాల్లో దేనికి సమస్య వచ్చినా వెంకయ్య తలకు చుట్టుకుంటోంది.
తాజాగా ఆయనకు హైకోర్టు విభజన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సమస్యలు తలనొప్పిగా పరిణమించాయి. నిజానికి, వెంకయ్య నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు. అయితే, కర్ణాటక రాష్టం నుంచి ఆయన రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఈ స్థితిలో కూడా ఆయనను తెలుగు రాష్ట్రాల నాయకులు ఇరకాటంలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేయడంతో ఆయనపై ఆంద్రప్రదేశ్ ప్రతిపక్షాలు దాడులు ప్రారంభించాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పదేళ్లు ప్రత్యేక హోదా ఇవ్వాలని యుపిఎ ప్రభుత్వ హయాంలో పట్టుబట్టి సాధించిన వెంకయ్య నాయుడు ఇప్పుడు ఎందుకు నోరు విప్పడం లేదని కాంగ్రెసు నాయకుడు శైలజానాథ్ ఎత్తిపొడిచారు. వెంకయ్యనాయుడిపై కాంగ్రెసు పార్టీ పెద్ద యెత్తున దాడికి దిగే సూచనలు కనిపిస్తున్నాయి.వెంకయ్య నాయుడిపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కూడా ఎదురు దాడికి దిగుతోంది.
ఇక, హైకోర్టు విభజనలో జాప్యంపై తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్), కాంగ్రెసు నాయకులు వెంకయ్య నాయుడిపై విరుచుకుపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో మిలాఖతై హైకోర్టు విభజన జరగకుండా వెంకయ్య నాయుడు అడ్డుపడుతున్నారని టిఆర్ఎస్ విమర్శిస్తోంది. ఈ రకంగా కరవమంటే కప్పకు కోపం, విడువుమంటే పాముకు కోపం అన్నట్లుగా వెంకయ్య నాయుడి పరిస్థితి తయారైంది.
గతంలో తెలంగాణ నుంచి వెంకయ్య నాయుడు తీవ్ర విమర్శలకు గురయ్యారు. ఎపికి పదేళ్లు ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేసినప్పుడు తెలంగాణ బిల్లు రాజ్యసభ ఆమోదం పొందకుండా వెంకయ్య నాయుడు అడ్డుపడుతున్నారని తెలంగాణ నుంచి విమర్శలు వచ్చాయి. చంద్రబాబు, వెంకయ్య నాయుడు ఇద్దరు కలిసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకుంటున్నారని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సమర్థిస్తూ ఎపి ప్రయోజనాల కోసం ఆయన పట్టుబట్టినప్పుడు కూడా తెలంగాణను అడ్డుకోవడానికే వెంకయ్య నాయుడు ఆ డిమాండ్లు పెడుతున్నారనే విమర్శలు తెలంగాణ నుంచి వచ్చాయి. ఆ తర్వాత కూడా ఎపికి ప్రత్యేక హోదాపై ఆయన పలు వైపుల నుంచి విమర్శలు ఎదుర్కుంటూనే ఉన్నారు.