కన్నీటి పర్యంతమయ్యా.. మోడీ ఓదార్చారు: ఎన్టీఆర్ పిలిచినా వెళ్లలేదని వెంకయ్య
పదవులు తానెప్పుడూ కోరుకోలేదని.. అవే తనను వెతుక్కుంటూ వచ్చాయని ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్యనాయుడు అన్నారు. చిన్నతనంలోనే పార్టీ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిని చేసిందని..
హైదరాబాద్: పదవులు తానెప్పుడూ కోరుకోలేదని.. అవే తనను వెతుక్కుంటూ వచ్చాయని ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్యనాయుడు అన్నారు. బీజేపీ.. చిన్నతనంలోనే తనను రాష్ట్ర పార్టీకి అధ్యక్షుడిని చేసిందని.. కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు పార్టీ జాతీయ అధ్యక్షుడిని చేసిందని గుర్తుచేసుకున్నారు.
కన్నీటి పర్యాంతమయ్యా..
హైదరాబాద్లో నిర్వహించిన ఆత్మీయ అభినందన కార్యక్రమంలో వెంకయ్యనాయుడు పాల్గొని ప్రసంగించారు. పార్టీని తల్లిగా భావించే తనకు.. పార్టీని శాశ్వతంగా వీడే సందర్భం రావడంతో కన్నీటి పర్యంతమయ్యానని.. అప్పుడు ప్రధాని మోడీ తనను ఓదార్చారని తెలిపారు.
Recommended Video
ఎంతో బాధగా ఉంది..
అమ్మలాంటి పార్టీకి ఇప్పుడు దూరమవడం తనకు ఎంతో బాధగా ఉందని అన్నారు. 2020లో రాజకీయాల నుంచి తప్పుకోవాలనేది తన నిర్ణయమని, పదవిలో ఉండగానే రాజకీయాలు వదిలేసి, సామాజిక సేవలో పాల్గొంటానని తెలిపారు. సమస్యల్ని కలిసి పరిష్కరించుకోవాలని తెలుగు రాష్ట్రాలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఎవరూ ఎవరికీ శత్రువులు కాదని అన్నారు. ఉపరాష్ట్రపతి అయ్యాక మరో కొత్త ప్రపంచంలోకి తాను వెళ్లాలని అన్నారు.
ఎన్టీఆర్ పిలిచినా..
‘1983లో టీడీపీ ప్రభంజనంలోనూ నేను ఘన విజయం సాధించాను. ఆ తర్వాత తమ పార్టీలోకి వస్తే మంత్రి పదవి ఇస్తానని ఎన్టీఆర్ ఆహ్వానించినా తిరస్కరించాను. 2019లో మోడీ మళ్లీ ప్రధానమంత్రి అయ్యాక 2020లో రాజకీయాల నుంచి తప్పుకుని సామాజిక సేవలో నిమగ్నమవ్వాలని గతంలోనే నిర్ణయించుకున్నాను' అని వెంకయ్య చెప్పారు.
ఆరోపణలు విచారకరం
‘ఇన్నేళ్ల నా రాజకీయ జీవితంలో కుటుంబం నుంచి నాపై ఎలాంటి ఒత్తిడి పడలేదు. పిల్లలు నాపై ఆధారపడకుండా వారి కెరీర్ను చక్కదిద్దుకున్నారు. నా కుమారుడు చేస్తున్న వ్యాపారాల గురించి ఎప్పుడూ ఆరా తీయలేదు. నా పదవులు అడ్డం పెట్టుకుని వారు లబ్ధి పొందలేదు. వారిపై తప్పుడు ఆరోపణలు రావడం విచారకరం' అని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.
ప్రముఖుల పలకరింపు
ఈ కార్యక్రమానికి తెలంగాణ మంత్రులు కేటీఆర్, నాయిని నర్సింహారెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీలు సుజనా చౌదరి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ఎమ్మెల్యేలు కిషన్ రెడ్డి, చింతల, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి, లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ, మాజీ డీజిపీలు దినేష్ రెడ్డి, రాముడు, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, హీరోలు నాగార్జున, వెంకటేశ్, నటుడు మురళిమోహన్, సుద్దాల అశోక్ తేజ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వీరింతా వెంకయ్యతో తమకున్న అనుబంధాన్ని నెమరువేసుకున్నారు.