నిజమైన లీడర్: పవన్ కళ్యాణ్పై వీహెచ్, చిరంజీవికి వెంకయ్య ప్రశంస
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ రాజధాని ప్రాంతంలో పర్యటించి, రైతుల సమస్యలు తెలుసుకున్న నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు వి హనుమంత రావు ఆనందం వ్యక్తం చేశారు.
ప్రజలలోకి వెళ్లి వారి సమస్యలను పవన్ కళ్యాణ్ తెలుసుకోవడం తనకు చాలా సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ప్రజల ఇబ్బందుల పైన స్పందించేవాడే నిజమైన నాయకుడు అని కొనియాడారు. ప్రజల సమస్యల పైన పవన్ కళ్యాణ్ నిత్యం ఇలాగే స్పందించాలని విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రాజధాని చాలా అవసరమని చెప్పారు. అయితే, రైతుల ఇష్టాయిష్టాలను పరిగణనలోకి తీసుకోకుండా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బలవంతంగా భూములను లాక్కోవడం ఏమాత్రం మంచిది కాదన్నారు.
రాజధాని కోసం ఇష్టం లేకున్నా రైతుల భూములు లాక్కోవడం సరికాదని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్ని కేంద్ర ప్రభుత్వాన్ని వి హనుమంత రావు డిమాండ్ చేశారు. ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలన్నారు. రాష్ట్రంలో డెంగ్యూ పైన ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.
చిరంజీవి మూడో కన్ను: వెంకయ్య
తెలుగు సినిమా పరిశ్రమకు నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వర రావులు రెండు కళ్లు అని, వారి తర్వాత మన సినిమా పరిశ్రమకు చిరంజీవి మూడో కన్ను అని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు కితాబిచ్చారు.