అందుకే విభజన, తెలంగాణ అంటే ఇష్టం: వెంకయ్య, బాబు-కెసీఆర్ల ముందు 2 కోరికలు
తెలంగాణ ప్రాంతం అంటే తనకు ఎంతో ఇష్టమని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. విభజన జరిగింది ఎవరి ప్రాంతాలను వారు పాలించుకోవడానికే అన్నారు. సోమవారం తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో పౌర సన్మానం జరిగింది.
హైదరాబాద్: తెలంగాణ ప్రాంతం అంటే తనకు ఎంతో ఇష్టమని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. విభజన జరిగింది ఎవరి ప్రాంతాలను వారు పాలించుకోవడానికే అన్నారు. సోమవారం తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో పౌర సన్మానం జరిగింది.
ఈ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, మాజీ కేంద్రమంత్రి కృష్ణం రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడారు.
రాజకీయంగా ఎదిగింది హైదరాబాదులోనే, అందుకే
తాను రాజకీయంగా ఎదిగింది, ఒదిగింది హైదరాబాదులోనే అని వెంకయ్య నాయుడు చెప్పారు. అందుకే ఇక్కడి నుంచి తన పర్యటన ప్రారంభించాలనుకున్నట్లు చెప్పారు. రాజకీయంగా జన్మనిచ్చిన ప్రాంతం నుంచే పర్యటిస్తున్నానని చెప్పారు.
Recommended Video
తెలంగాణ నుంచే ఢిల్లీకి
తాను తెలంగాణ నుంచే ఢిల్లీకి వెళ్లానని వెంకయ్య నాయుడు చెప్పారు. తెలంగాణలోని అన్ని ప్రాంతాలను తిరిగానని చెప్పారు. ప్రజలకు అర్థమయ్యే భాషలో పాలన సాగాలన్నారు. పరిపాలనా భాషగా తెలుగు ఉండాలన్నారు. ఉద్యోగం రావాలంటే తెలుగు రావాలన్నారు.
ఓ ప్రాంతానికి అన్యాయం జరగాలని విభజన జరగలేదు
ఓ ప్రాంతానికి అన్యాయం జరగాలని రాష్ట్ర విభజన జరగలేదని వెంకయ్య నాయుడు చెప్పారు. ఎవరి ప్రాంతాలను వారు పరిపాలించుకోవడానికే విభజన అన్నారు. తెలుగు రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలన్నారు. రాష్ట్రాలుగా విడిపోయినా మనం తెలుగువారమే అన్నారు. మనల్ని ఇతరులెవరైనా తెలుగువారనే అంటారన్నారు. కనుక సమస్యలు సామరస్యపూర్వకంగా సహకరించుకోవాలని ఆయన సూచించారు. ఇద్దరు సీఎంలను రెండు కోరికలు కోరుతున్నానని, సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని, అలాగే తెలుగు భాషకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నానని చెప్పారు.
భోజన ప్రియుడిని కూడా, హైదరాబాద్ మినీ ఇండియా
తాను భాషా ప్రియుడిని మాత్రమే కాదని, భోజన ప్రియుడిని కూడా అని వెంకయ్య నాయుడు చెప్పారు. అభివృద్ధి ఫలాలు అందరికీ అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సౌత్ ఆఫ్ నార్త్, నార్త్ ఆఫ్ సౌత్.. హైదరాబాద్ అన్నారు.హైదరాబాద్ మినీ ఇండియా అన్నారు.
కడుపు నిండింది
కేసీఆర్ మాటలతో తన కడుపు నిండిపోయిందని వెంకయ్య అన్నారు. ఇక్కడి కొస్తే హైదరబాదు బిర్యానీ అని, అటు వెళ్తే నెల్లూరు చేపల పులుసు అని అంటారని అన్నారు. 1978లో తాను ఎమ్మెల్యేగా తొలిసారి హైదరాబాదు వచ్చానని అన్నారు. తాను పుట్టింది నెల్లూరు జిల్లా అయితే చదివింది వైజాగ్లో, ఇక రాజకీయంగా ఎదిగింది, ఒదిగింది హైదరాబాదులోనే అన్నారు.
తెలుగువాడినయ్యా, అదీ వెంకయ్య గొప్పతనం: నరసింహన్
తెలియని విషయాలు ఒప్పుకోవడం వెంకయ్య నాయుడు గొప్పతనం అని గవర్నర్ నరసింహన్ అన్నారు. ఏరికోరి వెంకయ్యను ఉప రాష్ట్రపతిగా ఎన్నుకున్నారని చెప్పారు. ఏడున్నరేళ్లుగా ఇక్కడ ఉండి తాను కూడా తెలుగువాడిని అయ్యానని చెప్పారు.
వెంకయ్య తేలిగ్గా ఎదగలేదు: కెసిఆర్
వెంకయ్య నాయుడు ఈ స్థాయికి తేలిగ్గా ఎదగలేదని సీఎం కెసిఆర్ అన్నారు. ఆయన అద్భుత వక్త అన్నారు. తెలుగు, ఇంగ్లీష్, హిందీల్లో అద్భుత ప్రసంగం చేస్తారన్నారు. కఠోర పరిశ్రమ, కృషితో ఆయన ఎదిగారన్నారు. తెలుగు వాడు ఉపరాష్ట్రపతిగా ఉండటం తెలుగు వారికి గర్వకారణమన్నారు.