తీవ్ర విషాదంలో కెసిఆర్, విద్యాసాగర రావుతో అనుబంధం ఇదీ..
విద్యాసాగర రావు మృతితో కెసిఆర్ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. తెలంగాణ ఉద్యమమే వారిద్దరినీ సన్నిహితం చేసింది.
హైదరాబాద్: ప్రభుత్వ సలహాదారు ఆర్. విద్యాసాగర్ రావు మరణం పట్ల ముఖ్యమంంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం తెలిపారు. విద్యాసాగర్ రావు మృతి పట్ల సీఎం కలత చెందారు. తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఉద్యమ సమయంలో తెలంగాణకు నీటి పారుదలరంగంలో జరిగిన అన్యాయంపై గణాంకాలతో సహా వివరాలు సేకరించి ప్రజలకు అవగాహన కల్పించిన విషయాన్ని కెసిఆర్ గుర్తు చేసుకున్నారు.
తెలంగాణకు నీటి విషయంలో జరిగిన మోసం,ప్రాజెక్టులపై జరిగిన అన్యాయంపై ఆయన చేసిన పోరాటం, అధ్యయనం అనన్య సామాన్యమైనదని ఆయన కొనియాడారు. తెలంగాణ ఉద్యమానికి, టిఆర్ఎస్ పార్టీకి, వ్యక్తిగతంగా తనకు ఎప్పటికప్పుడు వివరాలు అందిస్తూ, సలహాలు ఇస్తూ ముందుకు నడిపారని చెప్పారు.
తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ప్రాజెక్టుల రీ డిజైనింగ్ సహా నీటి పారుదల రంగంలో చేపట్టాల్సిన కార్యక్రమాల రూపకల్పనలో విద్యాసాగర్ రావు విశేష అనుభవం ఉపయోగపడిందని తెలిపారు. జయశంకర్ సార్ తర్వాత తెలంగాణ జాతికి దక్కిన మరో గొప్ప మహానుభావుడు విద్యాసాగర్ రావు అని సిఎం అన్నారు. తెలంగాణ ఉద్యమమే వారిద్దరిని కలిపి, సన్నిహితం చేసింది.
ఆటలూ పాటలంటే ఇష్టం..
బాల్యం నుంచి ఆటలు, పాటలు, రాతలన్నా విద్యాసాగర్రావుకు చాలా ఇష్టం. ఆరో తరగతిలోనే లోభి అనే కథను బాలపత్రికకు పాంపారని చెబుతారు చిన్నప్పుడు గిరీషం అనే కలం పేరుతో ఆయన రాసిన రచనలు చాలా పత్రికల్లో వచ్చాయి.. చదువుకుంటూనే కవి సమ్మేళనాలు, నాటకాలు చూడటానికి వెళ్లేవారు. కాలేజ్ కాంపిటేషన్స్లో నాటకాలు కూడా వేసేవారు. నాటకాలంటే ఆయనకు పిచ్చి. ఆ తర్వాత సినిమాల్లో కూడా చిన్నపాటి పాత్రలు వేశారు.
ఢిల్లీలో ఉన్నప్పుడు విద్యాసాగర రావు...
ఢిల్లీలో ఉండగానే నీళ్ల విషయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని విద్యాసాగర రావు తెలుసుకున్నారు. రిటైర్మెంట్ తరువాత తిరిగి హైదరాబాద్ వచ్చారు. అంతకు ముందు దాదాపు 34 సంవత్సరాల పాటు కేంద్ర జలసంఘంలోనే విధులు నిర్వహించడంతో ఆయనకు దేశవ్యాప్తంగా జల వనరుల అంశంపై అపారమైన అనుభవం గడించారు. దాంతో నదీ జలాల పంపకంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయం ఆయనకు తెలిసి వచ్చింది. దానిపై ఆయన మరింత లోతుగా అధ్యయనం చేశారు. ఆయన అధ్యయనం కెసిఆర్కు ఉపయోగపడింది.
స్వయంగా ఆయన చెప్పారు...
కెసిఆర్తో తనకు గల అనుబంధాన్ని విద్యాసాగర రావే స్వయంగా చెప్పారు. ఆయనతో పరిచయం ఎలా ఏర్పడింది, ఎలా బలపడిందనే విషయాల గురించి నమస్తే తెలంగాణకు ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ ఇంటర్వ్యూ వివరాలను ఆయన మాటల్లోనే - 2002, ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి రోజున హబ్సిగూడలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయడానికి కేసీఆర్ వచ్చారు. వాస్తవానికి ఆ రోజు నాకు వేరే అపాయింట్మెంట్ ఉంది. నేను వెళ్లా. అప్పుడు వారి ఆఫీసు నుంచి పోన్ వచ్చింది. సార్ మీ ఇంటికి వస్తున్నారు అన్నారు. నేను హడలిపోయా.. ఈ పెద్దమనిషి రావడం ఏంటీ? కలవడం ఏంటీ? అని. సార్ను నేనే వచ్చి కలుస్తా అని చెప్పా.
కూర్చోవడానికి కుర్చీలు కూడా లేవు...
వాస్తవానికి ఆయన వస్తే కూర్చోవానికి కుర్చీలులేవు, వసతులు లేవు. చాయ్ ఇవ్వడానికి మనుషులు లేరు అన్న ఆలోచనలో నేనున్న. మరోవైపు అదే సమయంలో సికింద్రాబాద్లో తప్పకుండా వెళ్లాల్సిన పని ఉండే. కానీ ఆయన రానే వచ్చారు. నేనేమో సికింద్రాబాద్లో ఉన్న. మీరు పని చూసుకుని రండి అన్నారు. నేను మా మిసెస్కు పోన్ చేసి, ఫలానా ఆయన వస్తారట చాయ్, నీళ్లు ఇవ్వమని చెప్పా. నేను నా పని పూర్తయిందో లేదో మా మిసెస్ పోన్ చేశారు. సార్ వచ్చారు. టీ ఇచ్చా. కూర్చున్నారు అని. హడవిడిగా ఆటో పట్టుకుని వచ్చా. వచ్చేటప్పటికీ వీధి వీధంతా కార్లే. ఇంట్లోకి వచ్చేసరికి చాలామంది ఉన్నారు. రావడంతోనే పలకరించారు.
మీరు హెల్ప్ చేయాలని కెసిఆర్ అన్నారు..
మీరు మాకు హెల్ప్ చేయాలి. మాకు నీటిపారుదల రంగ ఇన్పుట్స్ లేవు. ప్రజలకు చెప్పడానికి ఇన్పుట్స్ కావాలి. తెలంగాణ కావాలి అంటే ఎందుకు, ఏమిటి అంటారు కదా! అందుకే మీరు సాయం చేయాలి అన్నారు. మీ గురించి జయశంకర్ సార్ చెప్పారు. తెలంగాణకు అన్యాయం జరిగిందని అందరూ చెప్పగలరు కానీ సాధికారికంగా చెప్పగలిగే వ్యక్తులు లేరు. జయశంకర్సార్ తంటాలు పడుతున్నారు. మీరు వస్తే ఇంకా బాగుంటుంది అన్నారు. ఇలా కేసీఆర్ తో కలిసి తెలంగాణకు నీటీవాటాలో జరిగిన అన్యాయాన్ని విద్యాసాగర్రావు ప్రపంచానికి తెలియజేశారు. ఆంధ్రోళ్లతో గట్టిగా వాదించారు.