అనూహ్యం!: ఉపరాష్ట్రపతిగా విద్యాసాగర్ రావు?.. జోరందుకున్న ప్రచారం..
ఉత్తరాదికి చెందిన వ్యక్తిని రాష్ట్రపతిగా ఎంపిక చేసిన తరుణంలో.. దక్షిణాదికి చెందిన నేతను ఉపరాష్ట్రపతిగా ఎన్నిక చేయాలనే బీజేపీ ఆలోచన ఇందుకు ఊతమిస్తోంది.
కరీంగనర్: రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్నాథ్ కోవింద్ను ఎంపిక చేసిన ఎన్డీయే ప్రభుత్వం.. ఇక ఉపరాష్ట్రపతి పదవిపై కసరత్తులు మొదలుపెట్టింది. ప్రస్తుతం ఉపరాష్ట్రపతిగా పనిచేస్తున్న హమీద్ అన్సారీ పదవీ కాలం అగస్టు 11న ముగియనున్నందునా.. ఆ స్థానాన్ని ఎవరితో భర్తీ చేయాలనే పనిలో ఎన్డీయే తలమునకలైంది.
ఈ నేపథ్యంలోనే తెలంగాణకు చెందిన బీజేపీ నేత, ప్రస్తుత మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్.విద్యాసాగరరావు పేరు తెరపైకి రావడం గమనార్హం.కాబోయే ఉపరాష్ట్రపతి విద్యాసాగర్ రావే అన్న చర్చ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఊపందుకుంది. ఉత్తరాదికి చెందిన వ్యక్తిని రాష్ట్రపతిగా ఎంపిక చేసిన తరుణంలో.. దక్షిణాదికి చెందిన నేతను ఉపరాష్ట్రపతిగా ఎన్నిక చేయాలనే బీజేపీ ఆలోచన ఇందుకు ఊతమిస్తోంది.
ప్రస్తుతం ఉపరాష్ట్రపతి రేసులో విద్యాసాగర్ రావు పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. అన్ని కలిసొస్తే.. ఆయన ఆ పదవిలో కూర్చోవడం అసాధ్యమేమి కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
విద్యాసాగర్ రావు నేపథ్యం ఇది!:
తెలంగాణలో బీజేపీ ప్రముఖ నేతగా విద్యాసాగర్ రావు అందరికీ సుపరిచితులే. ఆయన కుటుంబం దశాబ్దాలుగా రాజకీయాల్లో కొనసాగుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కోనరావుపేట మండ లం నాగారం గ్రామంలో 1942 ఫిబ్రవరి 12న ఆయన జన్మించారు. ప్రాథమిక విద్యను వేములవాడ, కరీంనగర్ లలో, ఉన్నత విద్యను ఉస్మానియాలో పూర్తి చేశారు. ఉస్మానియా నుంచే ఆయన బీఎస్సీ, ఎల్ఎల్బీ పట్టా పొంది న్యాయవాద వృత్తిని కూడా పూర్తి చేశారు.
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తో మొదలు:
జనసంఘ్తో విద్యాసాగర్ రావు రాజకీయ ప్రస్థానం మొదలైంది. అంతకుముందు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లో ఆయన చురుకైన పాత్ర పోషించారు. 1977లో జనసంఘ్ పార్టీ జనతా పా ర్టీలో విలీనం కాగా ఆయన కరీంనగర్ జిల్లా జనతా పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. తర్వాతి కాలంలో జనసంఘ్ నాయకులు జనతాపార్టీ నుంచి బయటకొచ్చి 1980లో బీజేపీని ఏర్పాటు చేయడంతో.. విద్యాసాగర్ రావు కూడా అందులో చేరారు.
మెట్పల్లి నుంచి ఎమ్మెల్యేగా:
బీజేపీలో చేరిక తర్వాత విద్యాసాగర్ రావు అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. 1985లో మెట్ పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలవడం ద్వారా తొలిసారి శాసనసభలో అడుగుపెటట్టారు. మెట్ పల్లి శాసనసభ్యుడిగా 1985-1998వరకు కొనసాగిన ఆయన.. ఆ సమయంలో బీజేపీ ఫ్లోర్ కూడా వ్యవహరించారు.
కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా:
1998,99లలో కరీనంగర్ ఎంపీగా 12వ,13వ లోక్ సభకు విద్యాసాగర్ రావు ప్రాతినిధ్యం వహించారు. వాజ్ పేయి హయాంలో కేంద్రహోంశాఖ సహాయమంత్రిగా పనిచేశారు. ఇక 2014లో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రావడంతో.. అదే సంవత్సరం అగస్టు 30న మహారాష్ట్ర గవర్నర్ గా వ్యవహరించారు. తమిళనాడు గవర్నర్గా ఉన్న కొణిజేటి రోశయ్య 2016 ఆగస్టు 30న పదవి వీరమణ చేయగా, ఆగస్టు 31న విద్యాసాగర్ రావును తమిళనాడు గవర్నర్ గాను కొన్నాళ్లు బాధ్యతలు నిర్వర్తించారు.
మహారాష్ట్ర గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. అక్కడి సీఎం ఫృథ్విరాజ్ చౌహన్ మెజారిటీ కోల్పోయిన సందర్భంగా.. ఆయన రాజీనామాను అంగీకరించి రాష్ట్రపతి పాలన విధించారు.