తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగికి విజయవాడ డాక్టర్ ప్రాణదానం
హైదరాబాద్: 205 కిలోల బరువుతో రోగాలు, నడవలేని స్ధితిలో సొంత పనులు కూడా చేసుకోలేక ఇబ్బంది పడుతున్న తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగి దండు పండరీనాథ్కు విజయవాడలోని ఎండోకేర్ ఆసుపత్రి డాక్టర్ కొంగర రవికాంత్ పునర్జన్మ ప్రసాదించారు.
ఆరు నెలల క్రితం పండరీనాథ్కు బేరియాట్రిక్ ఆపరేషన్ నిర్వహించారు. ప్రస్తుతం పండరీనాథ్ బరువు 122 కిలోలకు తగ్గింది. ఆరు నెలల్లో 83 కిలోల బరువు తగ్గి, తన పనులను తానే స్వయంగా చేసుకుంటూ ఉద్యోగం కూడా చేసుకుంటున్నాడు.
మంగళవారం ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ రవికాంత్ ఈ అరుదైన ఆపరేషన్ గురించి వివరాలను తెలియజేశారు. మెదక్ జిల్లా నారాయణ్ ఖేడ్కు చెందిన ఆర్టీసీ ఉద్యోగి దండు పండరీనాథ్ (44) ఐదు సంవత్సరాల్లో 70 కిలోల నుంచి 200 కిలోలకు పైగా పెరిగారు.
ఈ అధిక బరువు కారణంగా నిద్రలేమి, ఆయాసం, గురక, మోకాళ్ల నొప్పులు, నడవలేని స్ధితిలో హైదరాబాద్లోని పలు ఆసుపత్రులకు తిరిగి సుమారు రూ.5 లక్షల వరకు ఖర్చు చేసినా ప్రయోజనం పొందలేకపోయారు.
ఈ క్రమంలో విజయవాడలోని ఎండోకేర్ ఆసుపత్రిలో స్ధూలకాయులకు అందిస్తున్న ఆధునిక వైద్య సేవల గురించి తెలుసుకుని ఇక్కడు వచ్చారు. చేతిలో డబ్బులు లేవని చెప్పటంతో డాక్టర్ రవికాంత్ మందులు మినహా మిగిలిని ఆసుపత్రి ఖర్చులను భరించి గత ఏడాది డిసెంబర్ 29న ఆధునికి స్టీవ్ గ్యాస్ట్రెక్టమీ విధానంలో ఆపరేషన్ చేశారు.
ఈ ఆపరేషన్ ఫలితంగా పండరీనాథ్ గత 6 నెలల్లో బరువు గణనీయంగా తగ్గి, ఇతర సమస్యలు కూడా తగ్గముఖం పట్టాయి. ప్రస్తుతం పండరీనాథ్ బరువు 122 కిలోలకు చేరిందని, మరిన్ని ఆహార నియమాలు పాటిస్తే మరో 30 కిలోలు తగ్గుతారని డాక్టర్ రవికాంత్ వెల్లడించారు.