విపక్షాల 'ఆపరేషన్ కెసిఆర్'!: ఉద్యోగుల ఆ జీతం ఆపొచ్చుగా.. కోదండ వద్ద పాయింట్ లాగారు
హైదరాబాద్: రైతు ఆత్మహత్యల పైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చిక్కుల్లో పడింది. అంతేకాదు, అధికార పార్టీ నేతల తీరు పైనా విపక్షాలు పెదవి విరుస్తున్నాయి. కాంగ్రెస్ - టిడిపి - బిజెపి - వామపక్షాలు ఒక్కటవ్వడాన్ని అధికార పార్టీ ప్రశ్నించింది.
అయితే, ఓ వైపు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని, ఇలాంటి సమయంలో అందరూ ఏకతాటి పైకి రావడం తప్పేమిటని మండిపడుతున్నారు. అలాగే, రైతుకు రుణమాఫీ చేస్తామని ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి కెసిఆర్ హామీ ఇచ్చారని, దానిని ఇప్పటి దాకా ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు.
రైతు ఆత్మహత్యల పైన ప్రభుత్వానికి సమాధానం చెప్పలేని పరిస్థితుల్లోనే.. సభ నుంచి విపక్షాలను మొత్తం సస్పెండ్ చేశారనే ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. ఓ వైపు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే... సభలో ఇంతకన్నా ముఖ్యమైన అంశం ఏమి ఉంటుందని ప్రశ్నిస్తున్నారు.
రైతుల ఆత్మహత్య పైన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంటోందని ఆరోపిస్తూ తెలుగుదేశం, కాంగ్రెస్, బిజెపి, వామపక్షాలు జిల్లాల్లో పర్యటిస్తున్నాయి. బంగారు తెలంగాణ అని చెప్పి.. ఆత్మహత్యల తెలంగాణను తీసుకు వస్తున్నారని ధ్వజమెత్తుతున్నారు. మొత్తంగా రైతుల ఆత్మహత్యపై కెసిఆర్ ప్రభుత్వం వైఫల్యం చెందిందంటూ ప్రజల ముందు నిలబెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.
మరోవైపు, తెలంగాణ ఉద్యమంలో కెసిఆర్కు అండగా నిలిచిన తెలంగాణ జేఏసీ చైర్మన్ ఆచార్య కోదండరాంను రైతులు, ప్రజలు నిలదీస్తున్నారు. రెండు రోజుల క్రితం కోదండరాం, స్వరాజ్ అభియాన్ జాతీయ కన్వీనర్ యోగేంద్ర యాదవ్లు మెదక్ జిల్లా మక్కరాజుపేటలో పర్యటించారు.
ఆ సమయంలో గ్రామస్తులు కోదండను నిలదీశారు. ప్రభుత్వం ఉద్యోగాలకు పెంచిన జీతాలను ఏడాది పాటు వాయిదా వేసుకొని రైతులను ఆదుకోవచ్చు కదా అని గ్రామస్తులు కోదండను ప్రశ్నించారు. ఉద్యమంలో ఎన్నో మాటలు మాట్లాడిన వారు ఇప్పుడు మౌనంగా ఉండటం ఏమిటని వాపోయారు.
స్వపరిపాలన, బంగారు తెలంగాణ అని చెప్పిన మీరు.. ఇప్పుడు ప్రజా సమస్యల పైన గట్టిగా ఎందుకు నిలదీయడం లేదని కోదండరాంను గ్రామస్తులు ప్రశ్నించారని తెలుస్తోంది. ఉద్యోగులకు 43 శాతం జీతాలు పెంచగలిగినప్పుడు రుణమాఫీని మాత్రం ఒకేసారి ఎందుకు అమలు చేయలేకపోతున్నారని ప్రశ్నించారు.