డజన్కు పైగా కెసిఆర్ లేఖలు, బాబు కోసమే మోడీ ఇలా: వినోద్
కరీంనగర్: మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని రాజకీయంగా బతికించడానికి, టీడీపీ ఉనికి కాపాడేందుకే ప్రధాని నరేంద్ర మోడీ కుమ్మకై హైకోర్టు విభజనను పక్కన పెట్టారని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు వినోద్ కుమార్ వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డికి బెయిల్ మంజూరైన నేపథ్యంలో ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆ విధంగా అన్నారు.
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం హైకోర్టును విభజించాలని ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీకి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు డజనుకుపైగా లేఖలు రాశారని, కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడను అనేకమార్లు తాము కలిశామని, నిండు సభలో కోర్టును విభజిస్తామని హామీ ఇచ్చినా ఇప్పటికీ అమలు కాలేదని ఆయన అన్నారు.
పీఎంతో భేటీకి సమయం ఇస్తే హైకోర్టు విభజనపై విన్నవిస్తామని, 21లోగా ప్రకటన రాకపోతే అన్ని పక్షాలను కలుపుకొని పార్లమెంట్ను స్తంభింపచేస్తామని వినోద్కుమార్ హెచ్చరించారు. హైకోర్టు విభజనపై నిండు సభలో హామీ ఇస్తే నమ్మామని, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ప్రవర్తిస్తున్న తీరుతో నమ్మకం పోయిందన్నారు. బేవరేజ్ కార్పొరేషన్కు బకాయిలు ఉన్నాయని తెలంగాణకు చెందిన రూ.1250 కోట్లను ఐటీశాఖ తీసుకున్నదని చెబుతూ ఏపీ ఖాతా నుంచి ఒక్క రూపాయి ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు.
ప్రధాని అన్నిరాష్ర్టాలను ఒకేలా చూస్తారని అనుకున్నామని, అయితే.ఏడాది పాలనను పరిశీలిస్తే చంద్రబాబుకు కొమ్ముకాస్తున్నట్లుగానే కనిపిస్తున్నదన్నారు. టీడీపీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి వ్యవహరించిన తీరు అసహ్యంగా ఉందన్నారు. తొడగొట్టి ఎవరిని బెదిరిస్తున్నారని ప్రశ్నించారు. సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్రెడ్డి పాల్గొన్నారు.