తెలంగాణలో తొలి వైపై గ్రామంగా వీర్నపల్లి: ఎంపీ వినోద్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో తొలి వైఫై గ్రామంగా వీర్నపల్లి చరిత్ర సృష్టిస్తుందని కరీంనగర్ ఎంపీ వినోద్ కుమార్ పేర్కొన్నారు. తన దత్తత గ్రామమైన వీర్నపల్లిలో సర్పంచ్ మాడుగుల సంజీవలక్ష్మీ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించగా, బుధవారం కలెక్టర్ నీతూ ప్రసాద్తో కలిసి గ్రామంలో పర్యటించారు.
గ్రామంలో రూ. 20 లక్షలతో నిర్మించనున్న సామూహిక కమ్యూనిటీ హాల్కు ఎంపీ వినోద్ కుమార్ భూమిపూజ చేశారు. మోడల్ స్కూల్లో కొత్తగా ఏర్పాటు చేసిన శుద్ధజల యంత్రాన్ని ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన గ్రామసభలో ఎంపీ మాట్లాడుతూ వీర్నపల్లిలో వైఫై ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్ర టెలికాం శాఖ మంత్రిని కోరినట్లు తెలిపారు.
త్వరలోనే సేవలు అందుబాటులోకి వచ్చేలా చూడాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. ప్రజలకు అందుబాటులో ఉండేలా పెట్రోల్ పంపును ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఇందుకు ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్(ఐఓసీ) సుముఖత వ్యక్తం చేసిందన్నారు.
దీంతో పాటు గ్రామస్తులు స్వయం ఉపాధి పొందేందుకు గొర్రెలు, పాడిపశువులు, కోళ్లు, చేపల పెంపకానికి రుణాలు మంజూరు చేస్తామన్నారు. అనంతరం కలెక్టర్ నీతూప్రసాద్ మాట్లాడుతూ గ్రామీణ మంచినీటి పథకం ద్వారా వాటర్షెడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.
గ్రామంలోని శ్మశానవాటిక కోసం 20 గుంటలు, డంపింగ్ యార్డుకు 20 గుంటల స్థలాన్ని కేటాయించినట్లు తెలిపారు. తండాల్లో త్వరలో ఏర్పాటు చేయనున్న రేషన్ దుకాణాల కోసం ప్రభుత్వానికి నివేదిక పంపామన్నారు. గ్రామంలోని సర్వే నెంబర్ 262లోని 200 ఎకరాల స్థలాన్ని కొన్నేళ్లుగా సాగు చేసుకుంటున్న వారికి పట్టాలు లేవని, ఎంపీ ఆదేశాల మేరకు లబ్ధిదారులకు పట్టాలిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఎల్సాని సుజాత, జడ్పీటీసీ తోట ఆగయ్య, ఎంపీటీసీ బోడ లక్ష్మి, జిల్లావైద్యఆరోగ్యాధికారి హలీం, డీఆర్డీఏ పీడీ అరుణశ్రీ, తహసీల్దార్ పవన్కుమార్ తదితరులు పాల్గొన్నారు.