ఇక విటుడిపై ఐపిసి 370(ఎ)కింద విచారణ: హైకోర్టు
హైదరాబాద్: వ్యభిచారానికి పాల్పడే విటుడిపై భారతీయ శిక్షాస్మృతి (ఐపిసి)లోని సెక్షన్ 370ఏ ప్రకారం కేసు నమోదు చేయాలని ఉమ్మడి హైకోర్టు స్పష్టం చేసింది. అన్నీ తెలిసి వ్యభిచారం పేరిట లైంగిక దోపిడీకి పాల్పడుతున్నందున ఐపిసిలో ఇటీవల కొత్తగా అమల్లోకి తెచ్చిన సెక్షన్ 370ఏ పరిధి కింద విటుడిపై కేసు నమోదు చేయవచ్చని న్యాయస్థానం తెలిపింది.
వ్యభిచారం నిర్వహించడానికి ఒక వ్యక్తిని వినియోగిస్తున్నారని తెలిసి.. అటువంటి వ్యక్తితో వ్యభిచరించడం లైంగిక దోపిడీకి పాల్పడడమేనని పేర్కొంది. కొత్త చట్టం ప్రకారం వ్యభిచారంలో పట్టుబడిన విటుడిని అమాయక నిందితుడిగా భావించడం కుదరదని, కేవలం వ్యభిచార నిరోధక చట్టం ప్రకారం కేసు నమోదు చేయడం సరికాదని వెల్లడించింది.
కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో ఒక అపార్ట్మెంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ఇద్దరు నిర్వాహకులతోపాటు ఒక విటుడు ఉన్నారు. నిర్వాహకులపై ఐపిసి సెక్షన్ 370ఏతోపాటు వ్యభిచార నిరోధక చట్టం (పిఐటి) చట్టంలోని సెక్షన్లు 3,4,5,6 ప్రకారం కేసులు నమోదు చేశారు.
విటుడిపై పిఐటి సెక్షన్ 4 ప్రకారం పోలీసులు కేసును నమోదు చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. దీనిని సవాల్ చేస్తూ విటుడు హైకోర్టును ఆశ్రయించాడు. తనపై సెక్షన్ 4 విధించడం సరికాదంటూ అభ్యర్థించారు. దీనిపై తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు చేస్తూ.. విటుడిపై సెక్షన్ 4 ప్రకారం కేసు నమోదు సరికాదని, ఐపిసి 370ఏ ప్రకారం కేసు నమోదు చేసే అవకాశముందని వివరించారు.
పిపి వాదనలతో జస్టిస్ యూ దుర్గాప్రసాదరావు ఆధ్వర్యంలోని ధర్మాసనం ఏకీభవించింది. అయితే, వ్యభిచారం కోసం మహిళలను తరలించారని తెలిసి, వ్యభిచరించిన విటుడు ఐపిసి 370ఏ పరిధిలోకి వస్తాడని తీర్పునిచ్చింది. హైకోర్టుకు సంక్రమించిన అధికారాల ఆధారంగా సెక్షన్ 370 ఏ కింద కేసును విచారణకు స్వీకరించాలని దిగువ కోర్టుకు ఆదేశాలు జారీచేసింది.