తగ్గేది లేదు.. జేఏసీలో లుకలుకల్లేవ్.. త్వరలో మరో కార్యాచరణ: కోదండరాం
ఈ నెల 22న తెలంగాణ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో తలపెట్టిన నిరుద్యోగ నిరసన ర్యాలీ అరెస్టులతో ముగిసిపోయిన సంగతి తెలిసిందే. ఆ మరుసటి రోజు ర్యాలీ విఫలమైందని ప్రభుత్వ వర్గాలు ప్రకటిస్తే.. సూపర్ హిట్ అయిందని జ
హైదరాబాద్: ఈ నెల 22న తెలంగాణ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో తలపెట్టిన నిరుద్యోగ నిరసన ర్యాలీ అరెస్టులతో ముగిసిపోయిన సంగతి తెలిసిందే. ఆ మరుసటి రోజు ర్యాలీ విఫలమైందని ప్రభుత్వ వర్గాలు ప్రకటిస్తే.. సూపర్ హిట్ అయిందని జేఏసీ వర్గాలు వెల్లడించాయి.
ఇదే క్రమంలో జేఏసీ కన్వీనర్ పిట్టల రవీందర్ జేఏసీ ఛైర్మన్ కోదండరాంపై చేసిన వ్యతిరేక వ్యాఖ్యలు జేఏసీలో లుకలుకలను ఎత్తిచూపాయన్న చర్చ జరిగింది. కోదండరాం ఒంటెద్దు పోకడలు పోతున్నారని, వ్యక్తిగత ప్రయోజనాల కోసం పాకులాడుతున్నారని పిట్టల రవీందర్ విమర్శించారు.
ఈ నేపథ్యంలో జేఏసీ లుకలుకలపై తాజాగా జేఏసీ ఛైర్మన్ కోదండరాం స్పందించారు.హైదరాబాద్ నాంపల్లిలోని టీజేఏసీ కార్యాలయంలో జరిగిన జేఏసీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కమిటీలో లుకలుకలు ఉన్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని చెప్పారు.
తెలంగాణ నిరుద్యోగుల సమస్యలపై తదుపరి కార్యాచరణను చేపట్టేందుకు ఎల్లుండి విద్యార్థి, యువజన సంఘాలతో సమావేశం నిర్వహించబోతున్నట్లు తెలిపారు. నిర్బంధాలతో ప్రభుత్వం తమ పోరాటాన్ని అణిచేయాలని ప్రయత్నించినా.. వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పారు.
మైనార్టీల సమస్యలపై సుధీర్ కమిటీ సిఫార్సులను అమలుచేయాలని సర్కారుపై ఒత్తిడి తీసుకురావాలని సమావేశంలో నిర్ణయించినట్లు తెలిపారు. ఇందుకోసం ఆయా జిల్లాల్లో సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలియజేశారు. వచ్చేనెల 1న మహబూబ్నగర్, 4న నిర్మల్, 5న కరీంనగర్, 11న వరంగల్ జిల్లాల్లో సమావేశాలు నిర్వహించబోతున్నామని అన్నారు.