ఓటుకు నోటు తేల్చుకుంటాం, జగన్కి మోడీ భయం: దూళిపాళ్ల, లోకేష్ జపం
హైదరాబాద్: ఓటుకు నోటు కేసు అంశాన్ని తాము కోర్టులోనే ఎదుర్కొంటామని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దూళిపాళ్ల నరేంద్ర ఆదివారం అన్నారు. కేంద్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల కమిటీలు పదవీ ప్రమాణం చేసిన అనంతరం దూళిపాళ్ల మాట్లాడారు.
ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన కేంద్రాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. ఢిల్లీలో దీక్ష చేసేందుకు జగన్ భయపడుతున్నారని ఆరోపించారు. జగన్ కావాలనే ప్రత్యేక హోదా విషయంలో తమ పైన బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
కౌన్సిల్ ఎన్నికల్లో తెలంగాణలోని అధికార టిఆర్ఎస్ పార్టీకి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఎలా ఇచ్చిందో చెప్పాలని దూళిపాళ్ల నరేంద్ర ప్రశ్నించారు.
నారా లోకేష్ పేరు
ఆదవారం కేంద్ర కమిటీ, తెలుగు రాష్ట్రాల కమిటీల స్వీకారం జరిగిన సమయంలో... తెలుగు తమ్ముళ్లు నారా లోకేష్ పేరును జపిస్తున్నారు. తెలుగు తమ్ముళ్లలో లోకేష్ పేరే ప్రధానంగా వినిపిస్తోంది. చంద్రబాబుతో పాటు సీనియర్ నేతలంతా ముందు వరుసలో నిలబడగా.. వెనకవైపు రెండో వరుసలో నిలుచున్న లోకేష్ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా అందరితో కలిసి ప్రమాణ స్వీకారం చేశారు.
టిడిపి యువనేత, భవిష్యత్తులో తెలుగు రాష్ట్రాల్లో యువతను కలిపి ఉంచేది ఆయనేనని ఈ సందర్భంగా ఏపీ టిడిపి అధ్యక్షులు కళా వెంకట్రావు వ్యాఖ్యానించారు. ఆయనపై యువకులు ఎంతో ఆశలు పెట్టుకున్నారని, లోకేష్ వాటిని నిలుపుకుంటూ, పార్టీని ముందుకు నడిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
భవిష్యత్తును నిర్ణయించేది యువతేనన్నారు. ఈ దిశగా లోకేష్కు కీలక బాధ్యతలు అప్పగించారని చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు. లోకేష్కు బొకేలు ఇచ్చి, శాలువాలు కప్పి అభినందించేందుకు పార్టీ నేతలు, కార్యకర్తలు పోటీ పడ్డారు. లోకేష్ సైతం వారందరితో మమేకమై, కుశల ప్రశ్నలు వేసి, ఫోటోలు దిగారు.