కార్మికుల సమ్మెపై ఇప్పుడే కాదు: కోదండ, చెత్తనగరంగా హైదరాబాద్: కిషన్ రెడ్డి
హైదరాబాద్: ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ స్థానికత కలిగిన 121 మంది ఉద్యోగులను తక్షణమే రిలీవ్ చేయాలని కమలనాథన్ కమిటీకి విజ్ఞప్తి చేసినట్లు తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరామ్ తెలిపారు. ఉద్యోగుల విభజనకు సంబంధించి కమలనాథన్ కమిటీతో భేటీ ఆయిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా తెలంగాణ ఉద్యోగుల ఆకాంక్షలు మేరకు విభజన జరగడం లేదని కోదండరామ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగుల విభజనలో ఇప్పటికే ఉల్లంఘనలు జరిగాయని, విభజనను కమలనాథన్ కమిటీ మరింత ఆలస్యం చేస్తోందని ఆరోపించారు.
పారిశుద్ధ్య కార్మికుల సమ్మెపై త్వరలో స్పందిస్తానని కోదండరామ్ తెలిపారు. ప్రభుత్వం, పారిశుద్ధ్య కార్మికుల మధ్య నెలకొన్న సమస్యకు చర్చల ద్వారానే పరిష్కారం లభిస్తుందని చెప్పారు. ఆంధ్రా ఉద్యోగులు తెలంగాణలోనే ఉండాలని ఏపీ ప్రభుత్వం కోరుకుంటుందని దేవీప్రసాద్ ఆరోపించారు.
ఏపీలో ఉన్న తెలంగాణ ఉద్యోగుల కోసం ఉద్యమానికి కూడా వెనకాడబోమని టీఎన్జోవో నేత దేవీ ప్రసాద్ తెలిపారు. కమలనాథన్ కమిటీని కలిసిన వారిలో తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరామ్, టీఎన్జోవో నేత దేవీ ప్రసాద్, రవీందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.
పారిశుద్ధ్య కార్మికుల సమ్మె జఠిలం కావడానికి కారణం కేసీఆరే: లక్ష్మణ్
రాష్ట్రంలో పారిశుద్ధ్య కార్మికుల సమ్మె జఠిలం కావడానికి కారణం సీఎం కేసీఆరేనని బీజేఎల్పీ నేత లక్ష్మణ్ ఆరోపించారు. కార్మికులతో చర్చలు జరపకుండా సమ్మె విరమించుకోవాలని బెదిరించడం సరైందికాదన్నారు. పారిశుద్ధ్య కార్మికులు చాలీచాలని జీతాలతో పనిచేస్తున్నారన్నారు.
గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులను దేవుళ్లన్న కేసీఆర్, వారి డిమాండ్లను ఎందుకు తీర్చడం లేదని ప్రశ్నించారు. హైదరాబాద్ను కేసీఆర్ చెత్తనగరంగా మార్చారని మండిపడ్డారు. కార్మికులకు మద్దతుగా రేపటి నుంచి ఆందోళనలు ఉధృతం చేస్తామని లక్ష్మణ్ హెచ్చరించారు.
రేపటి బంద్కు టీడీపీ మద్దతు: సీతక్క, దొమ్మాటి
పారిశుద్ధ్య కార్మికుల సమ్మెకు సంఘీభావంగా శుక్రవాం వామపక్షాలు చేపట్టిన బంద్కు టీడీపీ మద్దతు ఉంటుందని ఆ పార్టీ నేతలు సీతక్క, దొమ్మాటి సాంబయ్య తెలిపారు. పారిశుద్ధ్య కార్మికుల హక్కులను కేసీఆర్ కాలరాస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. కార్మికుల సమస్యలు పరిష్కారమయ్యే వరకూ వారికి అండగా ఉంటామని అన్నారు.
పారిశుద్ధ్య కార్మికుల సమస్యలపై కిషన్రెడ్డి
ప్రభుత్వం వెంటనే పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను పరిష్కరించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి డిమాండ్ చేశారు. ఇందిరాపార్క్లో బీజేపీ తలపెట్టిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే శుక్రవారం నుంచి తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు చేపడతామని హెచ్చరించారు.
కేసీఆర్కు దమ్ముంటే ఇప్పుడు స్వచ్ఛభారత్ నిర్వహించాలని అన్నారు. హైదరాబాద్ను విశ్వనగరంగా చేస్తామని చెప్పిన సీఎం కేసీఆర్ చెత్త నగరంగా మార్చారని కిషన్రెడ్డి వ్యాఖ్యానించారు.