బాబుకు టీ బిజెపి 'సెక్షన్ 8' షాక్: పొత్తులపై లేదన్న కిషన్, గ్రేటర్లో ఒంటరి?
హైదరాబాద్: 2019లోగా తెలంగాణ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయాలని తమ పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా ఆదేశించారని తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డి సోమవారం నాడు అన్నారు.
బెంగళూరు సమావేశాల్లో పొత్తుల విషయమై చర్చ జరగలేదని చెప్పారు. బీజేపీని బలోపేతం చేయాలని అమిత్ షా సూచించారని చెప్పారు. సొంతగా బలపడాలని ఆదేశించారన్నారు.
గ్రేటర్ ఎన్నికలకు ముందు...
త్వరలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం బీజేపీ తీరు చూస్తుంటే గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ దోస్తీ కట్టే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. ఏపీలోను బీజేపీ... టీడీపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఎదగాలని చూస్తోంది.
తెలంగాణలో బీజేపీకి టీడీపీతో కలవడం మొదటి నుండి ఏమాత్రం ఇష్టం లేదు. ఇప్పుడు ఓటుకు నోటు కేసు, సెక్షన్ 8, ఫోన్ ట్యాపింగ్ తదితర వ్యవహారాల నేపథ్యంలో తెలంగాణ బీజేపీ టీడీపీకి దూరంగా ఉంటేనే మంచిదని భావిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కిషన్ పొత్తులపై చర్చించలేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
సెక్షన్ 8 చిచ్చు
ఉమ్మడి రాజధాని హైదరాబాదులో సెక్షన్ 8 ఉండాలని ఏపీ ప్రభుత్వం లేదా టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. వారికి తెలంగాణ టీడీపీ నేతలు కూడా వంత పాడుతున్నారనే చెప్పవచ్చు. సెక్షన్ 8ను టీడీపీ మినహా అన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి.
ఏపీ కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా ఓటుకు నోటు వెలుగులోకి వస్తేనే సెక్షన్ 8 గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నిస్తున్నారు. దీంతో, సెక్షన్ 8 విషయంలో చంద్రబాబు ఏకాకి అయ్యారు. ఓటుకు నోటు విషయంలోను బీజేపీ మిత్రపక్షం టీడీపీని ఇప్పుడే వెనుకేసుకు వచ్చే పరిస్థితి లేదు.
కోర్టులో తేలుతుందని చెబుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన కూడా అదే అభిప్రాయం బిజెపి వ్యక్తం చేస్తోంది. సెక్షన్ 8 అని డిమాండ్ చేస్తున్న తెలుగుదేశం పార్టీతో మాత్రం తెలంగాణ బీజేపీ విభేదిస్తోంది. తాజా పరిణామాల నేపథ్యంలో గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ దోస్తీ కట్టకపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.