శిరీష, ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్యకేసు: ఆ 6 గంటలు ఏం జరిగింది, అన్నీ అనుమానాలే?
సిద్దిపేట జిల్లా కుకునూర్ ఎస్ ఐ ప్రభాకర్ రెడ్డి, బ్యూటీషీయన్ శిరీష ఆత్మహత్యలకు సంబంధం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు.
హైదరాబాద్: సిద్దిపేట జిల్లా కుకునూర్ ఎస్ ఐ ప్రభాకర్ రెడ్డి, బ్యూటీషీయన్ శిరీష ఆత్మహత్యలకు సంబంధం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు.అయితే ఈ అనుమానాలను ప్రభాకర్ రెడ్డి కుటుంబసభ్యులు , కుకునూర్ ప్రజలు కొట్టిపారేస్తున్నారు. మరో వైపు ఈ రెండు ఆత్మహత్యల కేసుల్లో అనేక అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఈ రెండు ఘటనలకు సంబంధించి అసలు వాస్తవాలను బయటపెట్టాలని మృతుల కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ ఘటనలతో సంబంధాలున్నా శ్రవణ్, రాజీవ్ లు నోరు విప్పితే అసలు విషయాలు వెలుగుచేసే అవకాశం ఉంది.అయితే ఈ రెండు ఆత్మహత్యలకు కేసులకు సంబంధించి అనేక అంశాలు మిస్టరీగానే మారాయి.
అసలు ఏం జరిగిందనే చర్చ సాగుతోంది. అయితే కుకునూర్ పోలీస్ స్టేషన్ లో రామకృష్ణారెడ్డి అనే ఎస్ ఐ గత ఏడాది ఆగష్టులో ఆత్మహత్య చేసుకొన్నారు.అదే పోలీస్ స్టేషన్ లో ఎస్ ఐ గా పనిచేస్తున్న ప్రభాకర్ రెడ్డి కూడ ఆత్మహత్య చేసుకోవడంతో పోలీస్ శాఖలో ఏం జరుగుతోందనే అనుమానాలు కూడ వ్యక్తమౌతున్నాయి.
ఇదే పోలీస్ స్టేషన్ లో పనిచేసే ఎస్ ఐ స్థాయి అధికారులు ఎందుకు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారనే విషయాన్ని సమగ్రంగా విచారణ చేపట్టాలని పోలీస్ బాస్ అనురాగ్ శర్మ ఆదేశాలు జారీచేశారు. అడిషనల్ డిజీ గోపాలకృష్ణను ఈ విషయమై విచారణ నిర్వహించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.అడిషనల్ డిజి గోపాలకృష్ణతో పాటు ఐజి స్టీఫెన్ రవీంద్ర ఇతర ఉన్నతాధికారులు కకునూర్ పోలీస్ స్టేషన్ కు వెళ్ళి పరిస్థితిని సమీక్షించారు.
ఈ రెండు ఆత్మహత్యలకు గల లింకేమిటీ?
సిద్దిపేట జిల్లా కుకునూరు ఎస్ ఐ ప్రభాకర్ రెడ్డి బుదవారం నాడు ఆత్మహత్య చేసుకొన్నారు. అయితే అతను ఆత్మహత్య చేసుకొన్న రోజుకు ముదే శిరీష అనే బ్యూటీషీయన్ ఆత్మహత్యకు పాల్పడింది.వీరిద్దరి ఆత్మహత్యలకు లింకు ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. శిరీష పనిచేస్తున్న ఫోటో స్టూడియో యజమాని రాజీవ్ అతని స్నేహితుడు శ్రవణ్ లతో కలిసి శిరీష కుకునూరు పల్లి వెళ్ళింది.రాజీవ్ తో శిరీష కు ఉన్న వివాదాల పరిష్కారం కోసం వారు ఎస్ ఐ ప్రభాకర్ రెడ్డిని ప్రయత్నించారని అంటున్నారు. అంతేకాదు శిరీషతో ఎస్ ఐ అసభ్యంగా ప్రవర్తించాడనే ప్రచారం కూడ సాగుతోంది.అయితే ఈ కారణంగానే మనస్థాపానికి గురైన శిరీష ఆత్మహత్య చేసుకొందనే వాదన కూడ ఉంది.అయితే ఆమెను చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించారా అనే చర్చ కూడ లేకపోలేదు.ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య కేసును తప్పుదోవ పట్టించేందుకు శిరీష ఆత్మహత్య కేసును ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య కేసుతో లింకు చేశారని ఆయన కుటుంబసభ్యులు, స్థానికులుఆరోపిస్తున్నారు.
తేజస్విని శిరీష మద్య వివాదం
స్టూడియో యజమాని రాజీవ్ కు శిరీష, తేజస్విని మద్య వివాదాలున్నాయనే ప్రచారం ఉంది. అయితే విషయమై తేజస్విని శిరీషకు అభ్యంతరకరంగా సందేశాలను పంపించిందని అంటున్నారు.ఈ వివాదం తీవ్రస్థాయికి చేరుకోవడంతోనే పరిష్కారం కోసం ఎస్ ఐ ప్రభాకర్ రెడ్డిని ఆశ్రయించినట్టు ప్రచారం సాగుతోంది.దీని కోసం రాజీవ్ తన స్నేహితుడు శ్రవణ్ సహయాన్ని కోరారు. అయితే ఈ మేరకు శ్రవణ్ తనకు పరిచయమున్న ఎస్ ఐ ప్రభాకర్ రెడ్డి సహకారం తీసుకోవాలని భావించారు. అందుకే వీరంతా కలిసి కుకునూర్ పల్లికి వెళ్ళారని సమాచారం.
ఆ ఆరు గంటలు ఏం జరిగింది?
సోమవారం రాత్రి పూట రాజీవ్, శ్రవణ్, శిరీషలు కుకునూర్ పల్లి వెళ్ళారు. తాను రాత్రికి ఆలస్యంగా వస్తానని శిరీష భర్తకు సోమవారం రాత్రి 8.40 గంటలకు సమాచారాన్ని ఇచ్చింది. రాత్రి తొమ్మిదిన్నర గంటల సమయంలో ఈ ముగ్గురూ కుకునూర్ పల్లి పోలీస్ స్టేషన్ కు చేరుకొన్నారు. ఎస్ ఐ క్వార్టర్ వద్దకు చేరుకొన్నారు. అయితే గెస్ట్ హౌజ్ లోనే రాత్రి ఒంటిగంటన్నరవరకు వీరిమద్య పంచాయితీ జరిగినట్టు ప్రచారం సాగుతోంది. రాత్రి ఒంటిగంట సమయంలో ఈ ముగ్గురు హైద్రాబాద్ కు తిరుగుపయనమయ్యారు.అయితే రాత్రి ఒంటిగంటన్నర సమయంలో తాను శామీర్ పేట ప్రాంతంలో ఉన్నట్టుగా శిరీష తన భర్త సతీష్ చంద్రకు వాట్సాప్ ద్వారా లోకేషన్ పంపింది.ఆ వెంటనే సతీష్ చంద్ర ఫోన్ చేసినా ఆమె ఫోన్ స్పందించలేదు.తెల్లవారుజామున నాలుగున్నర గంటలకు మరోసారి ఫోన్ చేసినా స్పందన రాలేనది ఆయన చెబుతున్నారు.ఈ ముగ్గురు తెల్లవారుజామును మూడుగంటలకు స్టూడియోకు తిరిగివచ్చారని అంటున్నారు. అయితే ఈ ఆరుగంటలు ఏం జరిగిందనేది ఇంకా మిస్టరీగానే ఉంది.ఈ మిస్టరీ వీడితేనే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయి. కుకునూర్ పల్లి నుండి హైద్రాబాద్ కు తిరిగి వస్తుండగా శిరీష్ రెండు సార్లు కారునుండి కిందకు దూకేందుకు ప్రయత్నించందని అంటున్నారు. భర్తకు ఆమె వాట్సాప్ ద్వారా లోకేషన్ సమాచారాన్ని పంపడం వెనుక కూడ ఆమె ఏదైనా సమాచారాన్ని చెప్పాలనుకొందా అనే అనుమానాలు కూడ వ్యక్తమౌతున్నాయి.
స్టూడియోకు వచ్చాక ఏం జరిగింది?
కుకునూరుపల్లి నుండి తెల్లవారుజామున మూడు గంటలకు వచ్చిన తర్వాత ఏం జరిగిందనేది కూడ స్పష్టంగా చెప్పడం లేదు. స్టూడియో వద్ద కారు దిగిన శ్రవణ్ కింది నుండి వెళ్ళిపోయాడని అంటున్నారు. అయితే శిరీష్ స్టూడియోలోకి వెళ్ళింది. అయితే రాజీవ్ 15 నిమిషాల తర్వాత స్టూడియోలోకి వెళ్ళినట్టు ప్రచారం సాగుతోంది. అప్పటికే స్టూడియోలో ఫ్యాన్ కు శిరీష్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొందని రాజీవ్ చెబుతున్నట్టుగా తెలిసింది. అయితే రాజీవ్ పొంతనలేని సమాధానాలు చెప్పడం కూడ పోలీసులకు అనుమానిస్తున్నారు. ఒకసారి బాత్రూమ్ లో ఉరేసుకొందని, మరోసారి ఫ్యాన్ కు ఉరేసుకొందని రాజీవ్ చెప్పడంతో పోలీసులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. చున్నీని కత్తిరించి తానే ఆమెను మంచంపై పడుకోబెట్టినట్టుగా రాజీవ్ పోలీసులకు చెప్పారు.మంగళవారం ఉదయం ఆరున్నర గంటలకు శిరీష భర్త సతీష్ చంద్రకు ఫోన్ చేసిన పోలీసులు స్టూడియోకు రప్పించారు. రాజీవ్ పై అనుమానాలను వ్యక్తం చేస్తూ భర్త సతీష్ చంద్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ ప్రశ్నలకు జవాబులేవీ?
కుకునూర్ పల్లి నుండి హైద్రాబాద్ కు వచ్చిన తర్వాత రాజీవ్, శిరీష ల మద్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించేందుకు ప్రయత్నించిన శ్రవణ్ ఎందుకు త్వరగా వెళ్ళిపోయాడనే ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయి. హైద్రాబాద్ కు తిరిగివస్తుండగా శిరీష్ రెండు సార్లు ఎందుకు కారు నుండి దూకేందుకు ప్రయత్నించిందనే విషయమై పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.శిరీష స్టూడియోలోకి వెళ్ళిన తర్వాత రాజీవ్ ఎందుకు 15 నిమిషాలపాటు స్టూడియో బయటే ఉన్నాడు. శిరీష ఆత్మహత్యపై రాజీవ్ ఎందుకు భిన్నవాదనలను విన్పించారు.బంజారాహిల్స్ పోలీసులు శ్రవణ్, రాజీవ్ లను బుదవారం ఉదయం అదుపులోకి తీసుకొన్నారు. అయితే శిరీష ఆత్మహత్య విషయం ఎస్ ఐ ప్రభాకర్ రెడ్డికి మంగళవారం తెలిసి ఉండే అవకాశం ఉంది. అయితే ఆయన బుదవారం నాడు ఎందుకు ఆత్మహత్య చేసుకొన్నారనే ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయి.
శిరీష వార్త వెలుగులోకి రావడంతో ఏమైంది
మంగళవారం ఉదయం శిరీష మృతి చెందింది. ఆమె మృతిని బంజారాహిల్స్ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. కానీ, బుదవారం ఉదయం ఈ విషయం మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. శిరీష ఆత్మహత్య కేసుతో లింకుందనే ఆరోపణలతో రాజీవ్ , శ్రవణ్ లను బుదవారం నాడుపోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. అయితే తాము శిరీషను కుకునూరుపల్లిక తీసుకెళ్ళినట్టు శ్రవణ్ , రాజీవ్ లు పోలీసుల వద్ద అంగీకరించారని అంటున్నారు. స్టూడియోలోని సిసిటీవి పుటేజీని స్వాధీనం చేసుకొని విచారిస్తున్నారు పోలీసులు. మరో వైపు తేజస్విని సైతం పోలీసులు ప్రశ్నించే అవకాశం లేకపోలేదు. శిరీష పోస్ట్ మార్టం నివేదిక వచ్చాక అసలు విషయాలు తెలుస్తాయి. అయితే శిరీష మృతదేహంపై గాయాలున్నాయని అంటున్నారు. అయితే ఈ విషయాలన్ని పోస్ట్ మార్టం నివేదికలో వెల్లడికానున్నాయి.