ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఎక్కడ: బాబుపై హరీష్
ఖమ్మం: స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆ పార్టీ ప్రస్తుత అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఎక్కడున్నారని తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు బుధవారం ప్రశ్నించారు. ఎన్టీఆర్ పార్టీ స్థాపించినప్పుడు సీఎం కేసీఆర్, మంత్రి తుమ్మల నాగేశ్వర రావులు అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేశారని చెప్పారు.
కానీ, చంద్రబాబు మాత్రం కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారన్నారు. ఇప్పుడు చంద్రబాబు తెరాసలో ఉన్న వాళ్లు.. తన స్కూలు నుండి వచ్చిన వాళ్లని చెప్పడం అర్థరహితమన్నారు. కరీంనగర్ సభలో మాట్లాడుతూ.. తెలంగాణకు విద్యుత్ ఇచ్చి ఆదుకుంటానని చెప్పారని, కానీ కేంద్ర ప్రభుత్వం దగ్గర ఒక్క యూనిట్ కూడా ఇవ్వమని ఆంధ్రా అధికారులు చెప్పారన్నారు.
ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు పైన తీవ్ర వ్యతిరేకత ఉందని, దానిని కప్పిపుచ్చుకోవడానికి తెలంగాణలో పర్యటిస్తూ ఏదో చేస్తున్నారని ఎద్దేవా చేశారు. పట్టభద్రుల ఎన్నికల్లో తెలంగాణ కోసం పోరాడిన పల్లా రాజేశ్వర రెడ్డిని గెలిపించాలని కోరారు. హరీశ్వర్ రెడ్డి ఖమ్మం జిల్లాలో తెరాస అభ్యర్థి తరఫున ప్రచారం నిర్వహించారు.
తెలంగాణలో తెరాస ప్రభుత్వ నిరంకుశ విధానాలకు చెక్ పెట్టేందుకు ఎన్డీఏ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా రామచంద్రరావు, రామ్మోహన్రావులను గెలిపించాలని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ .రమణ, తెలంగాణ బీజెపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
తెరాస సర్కార్ ఒంటెద్దుపోకడలకు చెక్ పెట్టాలన్నారు. బుధవారం హైదరాబాద్లోని ఎన్కేఎం గ్రాండ్ హోటల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థుల విజయానికి అనుసరించాల్సిన వ్యూహంపై టీడీపీ, బీజేపీ ముఖ్యనేతలు, ఎమ్మెల్యేలు చర్చించారు.