ఎర్రబెల్లికి క్లిష్ట పరిస్థితులు?: ఆశగా వెళ్తే.. అవుటాఫ్ ఫోకస్!, ఆంక్షలేమైనా..
టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు అసలు మీడియాలో కనిపించకుండా పోయారు.
హైదరాబాద్: నిస్సిగ్గు ఫిరాయింపులకు తెలుగు రాష్ట్రాల రాజకీయాలు పరాకాష్ఠ. కేసులకు భయపడి కొంతమంది పార్టీలు మారితే.. పదవులు ఆశించి పార్టీలు మారినవారు మరికొంతమంది. దీనికే 'అభివృద్ది' అని ముద్దు పేరు కూడా పెట్టుకున్నారు. ఆ పార్టీతోనే.. ఆ నాయకుడితోనే అభివృద్ది సాధ్యమని, అందుకే కండువాలు మార్చేశామని చెప్పారు.
అభివృద్ది సంగతెలా ఉన్నా.. దాని మాటున వ్యక్తిగత వృద్ది ప్రయోజనాలు ఉంటాయన్నది అందరికీ తెలిసిన సత్యమే. కానీ అభివృద్ది సంగతి దేవుడెరుగు మమ్మల్ని పట్టించుకున్నవారెవరు? అన్న చందాన తయారైంది కొంతమంది నేతల పరిస్థితి. అంతకుముందు ప్రత్యర్థులుగా ఉన్న వ్యక్తులతోను ఇప్పుడు కలిసి నడవాల్సి రావడం.. దానికి తోడు పార్టీలో అసలు తమకు ప్రాధాన్యం ఉందా? అన్న అనుమానం కలుగుతుండటం వారిని సందిగ్ధంలోకి నెట్టేస్తోంది.
ఎర్రబెల్లికి క్లిష్ట పరిస్థితి:
తెలంగాణ రాజకీయాల్లో ఎర్రబెల్లి దయాకర్ రావును ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు. టీడీపీలో ఉన్న సమయంలో ఎప్పుడూ మీడియా ఫోకస్ లో ఉండే ఎర్రబెల్లి.. ఇప్పుడసలు క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నారా లేరా? అన్నట్లుగా తయారయ్యారు. పార్టీ ఆదేశిస్తే తప్ప దేనిపై మాట్లాడకూడదన్న ఆంక్షలేమైనా పెట్టారో తెలియదు కానీ మొత్తానికి నోరు కట్టేసుకుని కూర్చుండిపోయారు ఎర్రబెల్లి.
Recommended Video
నో అపాయింట్మెంట్:
ఏం ఆశించైతే ఎర్రబెల్లి పార్టీలోకి వచ్చారో.. అది కూడా జరుగుతుందో లేదోనన్న మీమాంస మొదలైందట. అసలు సీఎం కేసీఆర్ అపాయింట్ మెంట్ దొరకడమే ఆయనకు గగనమైపోయిందన్న ప్రచారం కూడా ఉంది. ఇప్పటికీ నాలుగైదు సార్లు ప్రయత్నించి చూసినా.. అటు వైపు నుంచి సానుకూల స్పందన రాలేదట.
సీఎం మాత్రమే కాదు.. అటు మంత్రులు కూడా ఎర్రబెల్లికి అపాయింట్మెంట్ నిరాకరిస్తున్నారట. దీంతో కక్కలేక మింగలేక అన్నట్లుగా ఎర్రబెల్లి తనలో తానే మదనపడుతున్నాడన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఆ ఆశతోనే చేరినా!:
నిజానికి మంత్రి పదవి ఆఫర్ తోనే ఎర్రబెల్లి కారు క్యాంపులో చేరారన్న ప్రచారం ఉంది. అయితే కేబినెట్ పునర్వ్యస్థీకరణ గురించి ఊసే లేకపోవడంతో ఆవిధంగాను ఆయన భంగపడ్డారన్న వాదన వినిపిస్తోంది. నిజానికి కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు కేసీఆర్ ప్రయత్నించినా.. ఏపీలో పరిస్థితి చూసి కాస్త వెనుకడుగు వేశారన్న వాదన ఉంది.
వేరే పార్టీల నుంచి వచ్చిన నేతలకు మంత్రి పదవులు కట్టబెట్టడంతో.. అక్కడి టీడీపీలో కొంతమంది నేతలు రాజీనామా దాకా వెళ్లారు. దీంతో ఇప్పుడున్న పరిస్థితుల్లో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ చేయాలనుకోవడం.. తుట్టెను కదలించడమే అవుతుందన్న ఆలోచనతో వెనుకడుగు వేశారు. దీంతో ఆశావహులంతా కళ్లల్లో వత్తులు వేసుకుని మంత్రి పదవుల కోసం చూస్తూనే ఉన్నారు.
ఇక ముందు కూడా అంతేనా?:
ఫిరాయింపు నేతలకు మంత్రి పదవులు ఇవ్వకపోయినా.. కేసీఆర్కు వచ్చిన నష్టమేమి లేకపోవడంతో దానిపై అంతగా ఆయన ఫోకస్ పెట్టట్లేదనే చెప్పాలి. ఒకవేళ ఉంటే, గింటే.. 2019ఎన్నికలకు కొద్ది నెలల ముందు మాత్రమే పునర్వ్యవస్థీకరణ జరగవచ్చన్న ప్రచారం కూడా ఉంది. మరి అప్పుడైనా ఎర్రబెల్లి ఆశ నెరవేరుతుందో.. లేదా అది కూడా వట్టి ఊహాగానాలకే పరిమితమవుతుందో వేచి చూడాలి.