'రాష్ట్రపతి, గవర్నర్ పాదాలకు కేసీఆర్ దండం, అనుమానం': టీడీపీ, బీజేపీ ఒక్కటిగా
హైదరాబాద్: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, గవర్నర్ నరసింహన్ వంటి రాజ్యాంగ నేతల పాదాలకు కేసీఆర్ దండాలు పెడుతుండటం కొత్త అనుమానాలకు తావిస్తోందని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత నన్నూరి నర్సిరెడ్డి గురువారం అనుమానం వ్యక్తం చేశారు.
టీఆర్ఎస్ నేతలు ఉత్సవాలు, ఊరేగింపులు జరుపుకోవడానికి అనుమతులుంటాయి కానీ టీడీపీకి ఉండవా అని ప్రశ్నించారు. తలసాని శ్రీనివాస్ యాదవ్, తుమ్మల నాగేశ్వర రావు, కడియం శ్రీహరిలు టీఆర్ఎస్లో చేరి మంత్రిపదవులు తీసుకున్నప్పుడు నిర్వహించిన ర్యాలీల మాటేమిటని ప్రశ్నించారు.
నల్గొండ జిల్లా సభలో కేసీఆర్ చేత పట్టింది కూడా మారణాయుధమేనని, అలా అయితే ఆయన పైన ఎందుకు కేసు పెట్టలేదని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి విడుదల సందర్భంగా ర్యాలీ, కేసుల విషయమై ఆయన పైవిధంగా స్పందించారు.
రేవంత్ పైన కడియం మండిపాటు
రేవంత్ రెడ్డి సభ్యతా సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి విమర్శించారు. తనకు అంతకంటే ఎక్కువగా మట్లాడటం వచ్చని, కానీ బాధ్యతగల వ్యక్తినని, మనిషిని కాబట్టి అలాంటి వ్యాఖ్యలు చేయబోనన్నారు.
నీతినిజాయితీగా మారుపేరుగా ప్రపంచ వేదికలపై చెప్పుకునే చంద్రబాబు, నైతిక విలువలు కోల్పోయారన్నారు. ఓటుకు నోటు కేసులో పట్టపగలే పట్టుబడిన రేవంత్గానీ, ఫోన్ సంభాషణల్లోని గొంతు తనది కాదని చంద్రబాబుగానీ చెప్పడం లేదన్నారు. వారు తప్పు చేశారనటానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలన్నారు.
చంద్రబాబు ఎలాంటి రాజకీయ విలువలను ప్రోత్సహిస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారన్నారు. రేవంత్ వ్యాఖ్యల విషయంలోనూ పత్రికలు సంయమనం పాటించాలన్నారు.
గోదావరి పుష్కరాల పనుల తీరుపై టీడీపీ ఆగ్రహం
తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు ఎల్ రమణ, రావుల చంద్రశేఖర రెడ్డి, రాజారామ్ యాదవ్, పీ రాములు తదితరులు గురువారం నాడు విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో గోదావరి పుష్కరాలకు ఏర్పాట్ల పనులపై సీఎం కేసీఆర్ చెప్పిన మాటలన్నీ నీటిబుడగల మాదిరిగా ఉన్నాయన్నారు.
పుష్కరాల పనుల్లో తమ అనుయాయులకు నిధులు దోచిపెట్టే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. కుంభమేలాను మించి పుష్కరాలు ఏర్పాట్లు చేస్తామన్న కేసీఆర్, కనీసం అందులో సగం ్యినా చేయాలన్నారు. తాము పుష్కర ఘాట్లు పరిశీలిస్తామన్నారు.
గోదావరి పుష్కరాల పనుల తీరుపై బీజేపీ ఆగ్రహం
తెలంగాణలో పుష్కరాలను కుంభమేలాను తలపించేలా చేస్తామని కుంభకోణాలయం చేశారని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పుష్కరాల ఏర్పాట్లలో ప్రభుత్వం విఫలమైందన్నారు. పుష్కరాల పనులను పరిశీలించామని, తాము గుర్తించిన అంశాలతో ప్రభుత్వానికి నివేదిక ఇస్తామన్నారు.
పుష్కర ఘాట్ నిర్మాణమే ఇంకా పూర్తి కాలేదన్నారు. రోడ్ల మరమ్మతు జరగలేదన్నారు. చాలాపనులు ఇంత వరకు ప్రారంభం కాలేదన్నారు. 144 ఏళ్లకు వచ్చే మహా పుష్కరాలను నిర్వహించే తీరు బాగాలేదన్నారు. తెలంగాణ వచ్చాక ఇది మొదటి పుష్కరాలను, ఘనంగా నిర్వహిస్తామని టీఆర్ఎస్ చెప్పిందని గుర్తు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం రూ.600 కోట్లు ఖర్చు చేస్తానని చెప్పిందన్నారు. కేంద్రం రూ.50 కోట్లు ఇచ్చిందన్నారు. తెలంగాణ ఇంటర్మీడియేట్ బోర్డు నిర్లక్ష్యంతో 188 మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారమైందని కిషన్ మండిపడ్డారు.
తెలంగాణలో పునర్ మూల్యాంకణకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల జాబితా కేంద్రానికి పంపకపోవడంతో జేఈఈ మెయిన్స్లో ర్యాంకులను కోల్పోయారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా పట్టించుకోలేదన్నారు. తాము కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడామన్నారు.