చిరును చూపించి, వారూ తిడ్తున్నారు: కెసిఆర్తో పవన్ దోస్తీ! కొత్త ట్విస్ట్
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పైన ఓ వైపు ఏపీ తెలుగుదేశం పార్టీ ఎంపీలు, కేంద్రమంత్రులకు, మరోవైపు టీఆర్ఎస్ నేతలు మంగళవారం భగ్గుమన్నారు. పవన్ టీడీపీకి అనుకూలంగా మాట్లాడారని టీఆర్ఎస్ చెబితే, కెసిఆర్కు మద్దతుగా మాట్లాడటం విడ్డూరమని టీడీపీ విమర్శించింది.
టీఆర్ఎస్ నేతలు, మంత్రులు బాల్క సుమన్, హరీష్ రావు తదితరులు పవన్ కళ్యాణ్ పైన నిప్పులు చెరిగారు. మరోవైపు, టీడీపీ నేతలు, కేంద్రమంత్రులు సుజనా చౌదరి, కేశినేని నాని, కొనకళ్ల నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తదితరులు ఏకిపారేశారు.
పవన్ కళ్యాణ్ ప్యాకేజీ కళ్యాణ్గా మారాడని ఎంపీ బాల్క సుమన్ మండిపడ్డారు. పవన్ వ్యాఖ్యలపై స్పందిస్తే తన స్థాయిని తగ్గించుకున్నట్లు అవుతుందని మంత్రి హరీష్ రావు అన్నారు. పవన్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, ఓటుకు నోటు కేసు గురించి ఎందుకు మాట్లాడటం లేదని టీఆర్ఎస్ ప్రశ్నించింది.
సెక్షన్ 8 ఎందుకు వద్దంటున్నారని టీడీపీ నేతలు ప్రశ్నించారు. హైదరాబాదులో ఇళ్ల కూల్చివేత, ఫోన్ ట్యాపింగ్, ప్రభుత్వ ఉద్యోగాల తొలగింపు అవి కనిపించడం లేదా అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నిలదీశారు. వ్యాపారాలు చేసుకోవడం తప్పు కాదని, చిరు కూడా బిజినెస్ చేస్తున్నారని సుజన కౌంటర్ ఇచ్చారు.
విభజన చట్టంలో ఉన్న సెక్షన్ 8 గురించి అసలు పోరాడాల్సిన అవసరమే లేదని, కానీ పోరాడాల్సి వస్తుందని చెప్పారు. పవన్ తన సినిమాలు నడిపించుకునేందుకు, హైదరాబాదులోని ఆస్తులు కాపాడుకునేందుకు కెసిఆర్ పైన పొగడ్తలు కురిపిస్తున్నారని టీడీపీ నేతలు కొత్త ట్విస్ట్ ఇచ్చారు.
పార్లమెంటులో తాము గోడలు చూడలేదని, ఎన్నోసార్లు ప్రత్యేక హోదా పైన ప్రశ్నించామని, కావాలంటే రికార్డులు చూసుకోవచ్చని విజయవాడ ఎంపీ కేశినేని నాని చెప్పారు. పవన్ కళ్యాణ్ పైన కేశినేని నాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నీ ప్రశ్నలకు నేను సమాధానం చెప్పానని, నీవు చెప్పాలని నాని నిలదీశారు.