అట్లకాడతో వాతలు పెట్టిన భర్త, గృహిణి పోరాటం
హైదరాబాద్: భార్యతో నూరేళ్లు కలిసి జీవించాల్సిన భర్త ఆమె పాలిట కాలమయుడై, తల్లి దండ్రులతో కలిసి భార్యన వేధిస్తున్న ఘటన నగరంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మహబూబ్నగర్ జిల్లా కొల్లాపూర్ తాలుకా వెల్టూరు గ్రామానికి చెందిన జోగు నాగన్నపద్మ దంపతుల పెద్ద కుమార్తె గంగులు అలియాస్ గంగను బాలానగర్ రాజుకాలనీ దొంతిరెడ్డి నర్సిరెడ్డి, సావిత్రి దంపతుల కుమారుడు శ్రీనివాస రెడ్డికిచ్చి 20 నెలల క్రితం వివాహం జరిపించారు.
వివాహ సమయంలో రూ. 3 లక్షల నగదు, 4 తులాల బంగారాన్ని కట్నంగా ఇచ్చారు. శ్రీనివాస రెడ్డి భార్య అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఆమెను వేధించడం మొదలు పెట్టాడు. ఎక్కడికి వెళ్లినా, ఎవరితోనైనా మాట్లాడినా ఆమెను చితక బాదేవాడు. పండంటి బిడ్డకు జన్మనిచ్చినా ఆమెపై వేధింపులు ఆగలేదు. భర్తతో పాటు అత్త సావిత్రి, మామ నర్సిరెడ్డి సైతం ఆమెను వేధించేవారు.
ఇదంతా గమనించిన ఇంటి యజమాని చలపతిరావు ఇంటిని ఖాళీ చేయమని హెచ్చరించడంతో ఏప్రిల్ 1న ఇల్లు ఖాళీ చేసి సాయినగర్ వెంకటేశ్వర స్వామి ఆలయం సమీపంలోని ఇంటిని అద్దెకు తీసుకున్నారు. అక్కడ వేధింపుల ఇంకా ఎక్కువయ్యాయి. చివరకు తట్టుకోలేక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అత్తమామలు గంగను కట్టు బట్టలతో ఇంటినుంచి గెంటి వేశారు.
గంగను అట్లకాడతో వాతలు పెట్టినట్లు తన ఫిర్యాదులో పేర్కొంది. గంగ దయనీయ స్ధితిలో ప్రస్తుతం రాజు కాలనీ రోడ్డు పక్కన చంటి బిడ్డతో న్యాయం కోసం పోరాడుతోంది. తమ బిడ్డకు ఎలాగైనా న్యాయం జరగాలని ఆమె తల్లి దండ్రులు కోరుతున్నారు.