గొడ్డలితో భర్త తల నరికిన భార్య.. పోలీసుల ఎదుట లొంగుబాటు
తీవ్ర ఆగ్రహావేశానికి లోనైన దయ్యాల బాలవ్వ.. నిద్రిస్తున్న లచ్చయ్యపై గొడ్డలితో దాడి చేసి అతని తల నరికింది.
బోయినపల్లి: భార్యాభర్తల మధ్య వాగ్వాదం తీవ్ర ఘర్షణకు దారితీసి.. చివరకు ప్రాణాలే పోయిన ఘటనలు చాలానే చూసుంటాం. తాజాగా కరీంనగర్ జిల్లాలోని బోయినపల్లి గ్రామంలోను ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. తరుచుగా గొడవకు దిగే భర్త వేధింపులను తాళలేక ఓ భార్య అతన్ని కడతేర్చింది.
వివరాల్లోకి వెళ్తే.. బోయినపల్లి మండలం తడకొండ గ్రామంలో దయ్యాల బాలవ్వ, దయ్యాల లచ్చయ్య(60) అనే దంపతులు జీవనం సాగిస్తున్నారు. వీరిద్దరి మధ్య తరుచూ ఏదో విషయంలో గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఇదే క్రమంలో గత గురువారం నాడు కూడా ఇద్దరి మధ్య గొడవ జరిగింది.
దీంతో తీవ్ర ఆగ్రహావేశానికి లోనైన దయ్యాల బాలవ్వ.. నిద్రిస్తున్న లచ్చయ్యపై గొడ్డలితో దాడి చేసి అతని తల నరికింది. అనంతరం నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయింది. వీరికి ఓ కొడుకు, కుమారుడు ఉన్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. గత కొంతకాలంగా బాలవ్వ, లచ్చయ్య.. ఇద్దరూ వేర్వేరుగా జీవిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే ఇద్దరి మధ్య మళ్లీ గొడవలు మొదలయ్యాయి. భర్త తీరుతో విసిగిపోయిన బాలవ్వ ఆవేశంలో అతన్ని హత్య చేసింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.