అమిత్ షా వ్యూహం: టార్గెట్ కెసిఆర్, నల్లగొండ జిల్లాలోనే ఎందుకు?
అమిత్ షా నేరుగా కెసిఆర్ను ఎదుర్కోవడానికి సిద్ధపడినట్లు కనిపిస్తున్నారు. నల్లగొండ జిల్లాను తన పర్యటనకు ఎంపిక చేసుకుని తెలంగాణలో పాగా వేయాలనేది ఆయన ఆలోచనగా కనిపిస్తోంది
హైదరాబాద్: బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షా తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె చంద్రశేఖర రావును టార్గెట్ చేస్తున్నారు. దీన్నిబట్టి తెలంగాణలో కెసిఆర్ను ఢీకొనడానికి ఆయన సిద్దపడినట్లే అర్థం చేసుకోవాలి.
తెలంగాణలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుపై ఆయన తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ తెలంగాణ ప్రభుత్వ తీరును తప్పు పట్టారు. నేరుగా కెసిఆర్ను టార్గెట్ చేసుకుని విమర్శనాస్త్రాలు సంధించారు. కేంద్ర పథకాలు తెలంగాణలో గ్రామస్థాయికి చేరడం లేదని ఆయన విమర్శించారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో విజయం తర్వాత బిజెపి తెలంగాణను లక్ష్యం చేసుకున్నట్లు కనిపిస్తోంది. కెసిఆర్ను ఢీకొనడానికి తమకు మాత్రమే సాధ్యమవుతుందనే సంకేతాలను అమిత్ షా ఇచ్చినట్లు కనిపిస్తోంది.
కెసిఆర్ దెబ్బ తీశారు...
తెలంగాణలో కెసిఆర్ తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలను చావుదెబ్బ తీశారు. కాంగ్రెసు, టిడిపిలకు చెందిన పలువురు శాసనసభ్యులనే కాకుండా సీనియర్ నాయకులను కూడా కెసిఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో చేర్చుకున్నారు. తెలుగుదేశం పార్టీ దాదాపుగా తుడిచిపెట్టుకుపోయిందనే చెప్పాలి. కాంగ్రెసులో కొంత మంది సీనియర్ నాయకులు మాత్రం కెసిఆర్పై పోరాటానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే, ఆ సీనియర్ నాయకుల్లోనే అనైక్యత, ప్రజల్లో అంతగా లేని ఆదరణ కాంగ్రెసుపై పెద్దగా ఆశలు కనిపించడం లేదు.
కాంగ్రెసు సీనియర్ నేతలు...
పాత నల్లగొండ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) బలహీనంగా ఉంది. కాంగ్రెసుకు బలమైన నాయకులున్నారు. కానీ, క్యాడర్ అంతగా ఉన్నట్లు లేదు. తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ జిల్లాకు చెందినవారే. సిఎల్పీ నేత జానా రెడ్డి కూడా ఇక్కడి వారే. సీనియర్లను సవాల్ చేస్తున్న కోమటిరెడ్డి బ్రదర్స్ ఇక్కడి వారే. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఉన్నారు. కానీ వారి మధ్య ఐక్యత లేదు. పరస్పరం విమర్శలతో, అప నమ్మకాలతో ముందుకు సాగుతున్నారు. తెరాస బలహీనంగా ఉండడం, కాంగ్రెసు నాయకుల్లో అనైక్యత తమకు కలిసి వస్తుందని అమిత్ షా భావించి నల్లగొండ జిల్లాను తన తొలి విడత పర్యటనకు ఎంచుకున్నట్లు భావించవచ్చు.
కోమటిరెడ్డి బ్రదర్స్కు గాలం....
బిజెపి అధ్యక్షుడు అమిత్ షా కోమటిరెడ్డి బ్రదర్స్కు గాలం వేసినట్లు ఇటీవల ప్రచారం సాగింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిజెపిలోకి వస్తే పాత నల్లగొండ జిల్లా రాజకీయ ముఖ చిత్రం మారే అవకాశం ఉంది. పైగా, వారికీ సీనియర్లకూ మధ్య అసలు పొసగడం లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డితో వారు తీవ్రంగా విభేదిస్తున్నారు. దీంతో అమిత్ షా నల్లగొండ జిల్లాకు ప్రాధాన్యం ఇచ్చినట్లు కనిపిస్తున్నారు.
ఆ పార్టీలు బలహీనం కావడంతో...
కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ కెసిఆర్ను ఢీకొనే స్థితిలో లేవని బిజెపి భావిస్తోంది. దాన్ని ఆసరా చేసుకుని తెరాసకు ధీటుగా తయారు కావాలనే వ్యూహంతో ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తోంది. పోలింగ్ కేంద్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి కార్యాచరణను రూపొందించింది. క్షేత్రస్థాయిలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తల సాయం తీసుకునే దిశగా ముందడుగు వేస్తోంది. తెలంగాణలో సంఘ్ పరివార్ శక్తి బయటకు కనిపించకపోయినా ఎక్కువగానే ఉంది. దాన్ని వచ్చే ఎన్నికల్లో వాడుకుని కెసిఆర్ను ఓడించాలనే ధీమాతో ఉంది. కెసిఆర్ను ఓడించలేకపోయినా కాంగ్రెసు, టిడిపిలను పక్కకు తోసి రెండో అతి పెద్ద పార్టీగానైనా అవతరించడానికి అవకాశం ఉంటుందని బహుశా అమిత్ షా అనుకుంటూ ఉండవచ్చు.