గ్రేటర్ హైదరాబాద్ ఓటమి: బాధ్యత నారా లోకేష్దా, రేవంత్ రెడ్డిదా?
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఓటమికి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాధ్యత వహిస్తారా అనే ప్రశ్న ముందుకు వస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెసు అధ్యక్ష పదవికి దానం నాగేందర్ రాజీనామా చేసిన నేపథ్యంలో నారా లోకేష్పైకి ఆ ప్రశ్న ఎక్కుపెడుతున్నారు.
తనకు పూర్తి బాధ్యత అప్పగించనప్పటికీ నైతిక బాధ్యతగా రాజీనామా చేస్తున్నట్లు దానం నాగేందర్ ప్రకటించి కాంగ్రెసు నేతలను పలువురిని ఆత్మరక్షణలో పడేశారు. ఈ స్థితిలో కాంగ్రెసు అధిష్టానం తెలంగాణలో నాయకత్వాన్ని మార్చే ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.
నారా లోకేష్కు పరాభవం: కొడుకు కన్నా తండ్రే నయమట!
తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డిని తప్పించి ఎమ్మెల్సీ షబ్బీర్ అలీని గానీ మాజీ మంత్రి డికె అరుణను గానీ నియమించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి తన పదవి రాజీనామా చేస్తారని ఇటీవల గ్రేటర్ హైదరాబాద్ ఫలితాల తర్వాత పుకార్లు షికార్లు చేశాయి కూడా.
తెలుగుదేశం పార్టీ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో చావు దెబ్బ తిన్నది. కేవలం ఒక్క సీటును మాత్రమే దక్కించుకుంది. అయితే, బిజెపి నుంచి గానీ టిడిపి నుంచి గానీ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఓటమికి ఏ ఒక్కరూ బాధ్యత తీసుకోవడం లేదు.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అంతా తానై వ్యవహరించినప్పటికీ నారా లోకేష్ ఓటమికి బాధ్యత వహించే పరిస్థితి ఉండదనేది అందరికీ తెలిసిందే. కనీసం మాట వరుసకైనా ఆయన బాధ్యత వహిస్తున్నట్లు చెప్పలేదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి తనయుడు కావడంతో నారా లోకేష్ను పార్టీలో ఎవరూ తప్పు పట్టే పరిస్థితి కూడా లేదు.
Cartoon : TRS makes clean sweep
కాగా, పార్టీ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలోనూ, అభ్యర్థుల ఎంపికలోనూ కీలక పాత్ర పోషించారు. అయినా ఆయన బాధ్యత వహించే పరిస్థితి లేదు. అదే విధంగా గ్రేటర్ హైదరాబాద్ టిడిపి అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్ను కూడా బాధ్యుడిగా చేసే పరిస్థితి లేదు. తెలంగాణ టిడిపి అధ్యక్షుడు ఎల్. రమణను తొలగించే సాహసం అధినాయకత్వం నుంచి జరిగే అవకాశం లేదు. నారా లోకేష్ మాత్రమే కీలక పాత్ర పోషించారు కాబట్టి రమణను తప్పు పట్టి బలపశువుగా చేసే అవకాశం ఉండదు.
ఈ నేపథ్యంలో తెలంగాణలో టిడిపి పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుందని అంటున్నారు. చంద్రబాబు నాయుడు గానీ నారా లోకేష్ గానీ తెలంగాణ ప్రజలకు స్పూర్తిప్రదాతలు కాలేరని అర్థమవుతోంది. ఈ స్థితిలో 2019 ఎన్నికల నాటికి తెలుగుదేశం పార్టీ ఏమవుతుందనేది చెప్పడం కూడా కష్టంగానే ఉంది.
తెలంగాణ బిజెపి అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డిని పదవి నుంచి తప్పించే అవకాశాలు లేవని అంటున్నారు. ఎమ్మెల్సీ చింతల రామచంద్రా రెడ్డి రోహిత్ ఆత్మహత్య వివాదంలో చిక్కుకోవడం పార్టీ జాతీయ నాయకత్వానికి కిషన్ రెడ్డి స్థానంలో మరో నాయకుడిని పెట్టడానికి అవకాశం లేకుండా చేసింది. మొత్తం మీద, వచ్చే ఎన్నికల నాటికి బిజెపి, తెలుగుదేశం కూటమి భవిష్యత్తు ఏమిటనేది ప్రశ్నార్థకంగానే మారింది.