వ్యక్తికి యువతి చెప్పుదెబ్బలు: నకిలీ పోలీస్ ముఠా అరెస్ట్, ఇద్దరు జర్నలిస్ట్లు
హైదరాబాద్: ప్రేమ పేరుతో యువతితో అసభ్యంగా ప్రవర్తించిన ఓ వ్యక్తికి బాధిత యువతి, వారి కుటుంబ సభ్యులు చెప్పుతో కొట్టి బుద్ధి చెప్పిన సంఘటన పటాన్ చెరు ప్రాంతంలో జరిగింది. నిత్యం వేధిస్తుండటంతో అతనికి బుద్ధి చెప్పారు.
శంషాబాద్లో నకిలీ పోలీసుల ముఠా అరెస్ట్
పోలీసు వేషంలో రోడ్ల పైన కాపుకాసి రేషన్ బియ్యం తరలిస్తున్న లారీలను ఆపి డబ్బులు వసూలు చేస్తున్న నకిలీ పోలీసు ముఠాను శంషాబాద్ పోలీసులు మంగళవారం నాడు అరెస్టు చేశారు. ఏడుగురు సభ్యుల ముఠా కొంతకాలంగా పోలీసు వేషంలో కాపుకాసి, వాహనాలను ఆపి బెదిరించి డబ్బు వసూలు చేస్తోంది.
సెప్టెంబర్ నెల 28వ తేదీన హైదరాబాదుకు చెందిన ఓ రేషన్ డీలర్ నుంచి బలవంతంగా రూ.80వేలు వసూలు చేశారు. అనుమానం వచ్చిన లారీ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిఘా వేసిన పోలీసులు నకిలీ పోలీసులను అరెస్టు చేశారు.
ఈ ముఠా సభ్యుల్లో ఇద్దరు జర్నలిస్టులు కూడా ఉన్నారు. నిందితుల్లో విజయ భాస్కర్ రెడ్డి, రాజేందర్ రెడ్డి ఓ దినపత్రికలో విలేకరులుగా పని చేస్తున్నారని తెలుస్తోంది. వెంకట రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, శివకుమార్, శివకుమార్ రెడ్డి, శ్రీనివాస్ ముఠాగా ఏర్పడి పోలీసుల వేషదారణలో దోపిడీలకు పాల్పడుతున్నారు.
పోలీసుల అదుపులో కాంగ్రెస్ నేత
ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేశ్వర రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాజీ కౌన్సిలర్ రఘువీర్ పైన హత్యాయత్నం కేసులో ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేందర్ను పోలీసులు అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ మంగళవారం నిర్మల్ బంద్కు పిలుపునిచ్చారు.
పార్టీ నాయకులు, కార్యకర్తలు ధర్నాలకు యత్నించారు. మహేశ్వరరెడ్డి తన అనుచరులతో పట్టణంలో బైక్ ర్యాలీ, ప్రదర్శన నిర్వహించారు. పోలీసులు వారిని అడ్డుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు.