భర్త బెదిరింపు, ఇంటికి స్త్రీలను..: బాత్రూం నుండి పోలీసులకు ఫోన్
హైదరాబాద్: ఓ వివాహిత శనివారం వేకువజామున స్నానపు గదిలో తనను తాను నిర్బంధించుకొని కంట్రోల్ రూమ్కు ఫోన్ చేసి రక్షించాలని కోరిన సంఘటన హైదరాబాదులో జరిగింది. పెళ్లైన కొద్ది రోజుల నుండే భర్త తాగి వచ్చి భార్యను చితకబాదేవాడు. అత్త కట్నం కావాలంటూ వేధించేది. భర్త నేరుగా మహిళలను ఇళ్లకే తీసుకు వచ్చేవాడు. శుక్రవారం రాత్రి వారి ఆగడాలు శ్రుతిమించాయి.
దీంతో శనివారం ఉదయం ఆ మహిళ పోలీసులకు ఫోన్ చేసింది. పోలీసులు తక్షణం స్పందించి ఆమెను కాపాడారు. అత్త, భర్తలను అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి సమాచారం మేరకు... కరీంనగర్ జిల్లాకు చెందిన అరుణ డిగ్రీ చదువుతోంది. హైదరాబాదులోని మోతీనగర్లో అక్క, బావలైన వసుంధర, రాధాకృష్ణ వద్ద ఉండేది. బావనే మరదలికి సబంధం చూశాడు.
తనకు తెలిసనన వారి ద్వారా రెజిమెంటల్ బజార్కు చెందిన చంద్రశేఖర్ కుటుంబ సభ్యులతో పరిచయం ఏర్పడింది. చంద్రశేఖర్ ఫోటోగ్రాఫర్. అతని కంటే ముందే తమ్ముడికి పెళ్లైంది. ఈ నేపథ్యంలో రెండు కుటుంబాలతో మాట్లాడిన రాధాకృష్ణ మరదలికి, చంద్రశేఖర్కు వివాహం జరిపించాడు.
ఆగస్టు 16వ తేదీన వారి పెళ్లి జరిగింది. చంద్రశేఖర్ కొద్ది రోజుల అనంతరం నిత్యం తాగి వచ్చి భార్యను హింసించేవాడు. వేరే మహిళలను ఇంటికే తీసుకు వచ్చేవాడు. కొడుకు చేష్టలకు అత్త కూడా వంత పాడింది. శుక్రవారం అర్ధరాత్రి నుండి అత్త, భర్త ఆమెను కొట్టారు. గొంతు పిసికి చంపేందుకు యత్నించారుత.
దీంతో అరుణ అత్త లేని సమయం చూసి ఫోన్ తీసుకుంది. శనివారం ఉదయం నాలుగు గంటల సమయంలో బాత్ రూంలోకి వెళ్లి గడియ పెట్టుకుంది. కంట్రోల్ రూంకు ఫోన్ చేసింది. ఇది తెలిసిన భర్త, అత్త తలుపులు బద్దలు కొట్టే ప్రయత్నం చేశారు. నిమిషాల్లో అక్కడకు చేరుకున్న పోలీసులు బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, అత్త, భర్తను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.